చెన్నై స్మాషర్స్‌కు షాక్‌  | Premier Badminton League starts good | Sakshi
Sakshi News home page

చెన్నై స్మాషర్స్‌కు షాక్‌ 

Dec 24 2017 1:46 AM | Updated on Dec 24 2017 1:46 AM

Premier Badminton League starts good - Sakshi

గువాహటి: పురుషుల సింగిల్స్‌ మ్యాచ్‌ల్లో కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్‌... మిక్స్‌డ్‌ డబుల్స్‌ మ్యాచ్‌లో టాంగ్‌ చున్‌ మన్‌–క్రిస్టినా పెడర్సన్‌ ద్వయం అదరగొట్టడంతో... ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌) మూడో సీజన్‌లో అవధ్‌ వారియర్స్‌ శుభారంభం చేసింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై స్మాషర్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో అవధ్‌ వారియర్స్‌ 4–3 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. తొలి మ్యాచ్‌గా జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌లో టాంగ్‌ చున్‌ మన్‌–క్రిస్టినా పెడర్సన్‌ (అవధ్‌) జంట 10–15, 15–5, 15–12తో క్రిస్‌ అడ్‌కాక్‌–గాబ్రియేలా అడ్‌కాక్‌ జోడీపై గెలిచి ఒక పాయింట్‌ సాధించింది. రెండో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్‌ (అవధ్‌) 15–12, 15–8తో డానియల్‌ ఫరీద్‌ను ఓడించాడు. దీనిని అవధ్‌ ట్రంప్‌ మ్యాచ్‌గా ఎంచుకోవడంతో అవధ్‌కు రెండు పాయింట్లు లభించాయి. దాంతో ఆ జట్టు 3–0తో ముందంజ వేసింది.

మూడో మ్యాచ్‌గా జరిగిన మరో పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌ (అవధ్‌) 15–12, 15–13తో లెవెర్‌డెజ్‌పై గెలవడంతో అవధ్‌ జట్టు రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 4–0తో విజయాన్ని ఖాయం చేసుకుంది. నాలుగో మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో క్రిస్‌ అడ్‌కాక్‌–యోంగ్‌ లీ జంట 15–11, 10–15, 15–11తో హెండ్రా సెతియవన్‌–చిన్‌ చుంగ్‌ (అవధ్‌) జోడీపై గెలిచింది. దాంతో చెన్నై ఖాతాలో తొలి పాయింట్‌ చేరింది. చెన్నై స్టార్‌ ప్లేయర్‌ పీవీ సింధుతో మహిళల సింగిల్స్‌లో అవధ్‌ వారియర్స్‌ తరఫున తలపడాల్సిన సైనా నెహ్వాల్‌ చీలమండ గాయంతో వైదొలిగింది. సైనా స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి చుక్కా సాయి ఉత్తేజిత రావు బరిలోకి దిగింది. సింధు 15–10, 15–9తో ఉత్తేజితపై గెలిచింది. ట్రంప్‌ మ్యాచ్‌లో నెగ్గినందుకు చెన్నైకు రెండు పాయింట్లు లభించాయి. దాంతో ఓవరాల్‌గా అవధ్‌ 4–3తో చెన్నైను ఓడించింది. ఆదివారం జరిగే మ్యాచ్‌లో నార్త్‌ ఈస్టర్న్‌ వారియర్స్‌తో హైదరాబాద్‌ హంటర్స్‌ తలపడుతుంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement