బుమ్రా యాక్షన్‌ షురూ...! | Jasprit Bumrah Joins Kohli And Boys At Practise In Vizag | Sakshi
Sakshi News home page

బుమ్రా యాక్షన్‌ షురూ...!

Dec 17 2019 4:14 PM | Updated on Dec 17 2019 4:15 PM

Jasprit Bumrah Joins Kohli And Boys At Practise In Vizag - Sakshi

విశాఖ: ఈ ఏడాది జూలై-ఆగస్టు నెలల్లో వెస్టిండీస్‌తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌ తర్వాత వెన్ను గాయం కారణంగా భారత క్రికెట్‌ జట్టుకు దూరమైన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా నెమ్మదిగా కోలుకుంటున్నాడు. వచ్చే ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్‌తో జరుగనున్న టెస్టు సిరీస్‌ నాటికి అందుబాటులోకి రావడానికి యత్నిస్తున్న బుమ్రా అందుకు తన కార్యచరణను మొదలు  పెట్టేశాడు. గాయం నుంచి బుమ్రా కోలుకున్నప్పటికీ, నేరుగా బౌలింగ్‌ యాక్షన్‌తో ఫీల్డ్‌లోకి దిగితే మరికొంత స్పష్టత వచ్చే అవకాశం ఉండటంతో ఆ మేరకు బుమ్రా సన్నద్ధమయ్యాడు. వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం విశాఖలో రెండో  వన్డే జరుగనున్న తరుణంలో టీమిండియా క్రికెటర్లకు బుమ్రా బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేయనున్నాడు.

ప్రధానంగా కోహ్లి, రోహిత్‌లకు బౌలింగ్‌ చేసి తనను టెస్టు చేసుకోనున్నాడు. దాంతో కోహ్లి అండ్‌ గ్యాంగ్‌తో కలిసి విశాఖకు చేరుకున్నాడు  బుమ్రా. ప్రాక్టీస్‌  సెషన్‌లో బుమ్రా బౌలింగ్‌ చేయడానికి సిద్ధమైన ఫొటోను బీసీసీఐ ట్వీట్‌ చేసింది. ఇక్కడ ఎవరో చూడండి అంటూ క్యాప్షన్‌  ఇచ్చింది. గాయం నుంచి కోలుకోవడానికి ఇప్పటివరకూ బెంగళూరులోని ఆటగాళ్ల పునరావాస శిబిరంలో శిక్షణ తీసుకున్న బుమ్రాను ప్రాక్టీస్‌ సెషన్‌లో బౌలింగ్‌ చేయడానికి విశాఖకు రమ్మంటూ టీమిండియా మేనేజ్‌మెంట్‌ ఆదేశించింది. దాంతో బుమ్రా జట్టుతో కలిశాడు. రోహిత్‌-కోహ్లిలకు బౌలింగ్‌ చేయడం కంటే పెద్ద టెస్టు ఏమి ఉండదని భావించిన మేనేజ్‌మెంట్‌.. బుమ్రా యాక్షన్‌ను దగ్గర్నుంచీ పరిశీలించనుంది. బౌలింగ్‌ వేయడానికి ఇంకా బుమ్రా ఏమైనా ఇబ్బందులు పడుతున్నాడా.. లేక పూర్వపు బౌలింగ్‌ను అందిపుచ్చుకున్నాడా అనే విషయంపై ప్రత్యేక దృష్టి నిలపనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement