విరాట్ సేన..కూల్ కూల్గా | india's openig pair firm in reply to england 477 runs | Sakshi
Sakshi News home page

విరాట్ సేన..కూల్ కూల్గా

Dec 17 2016 4:36 PM | Updated on Sep 4 2017 10:58 PM

విరాట్ సేన..కూల్ కూల్గా

విరాట్ సేన..కూల్ కూల్గా

చివరిదైన ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ సాధించిన భారీ స్కోరుకు టీమిండియా కూల్ కూల్గా సమాధానమిస్తోంది.

చెన్నై:చివరిదైన ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ సాధించిన భారీ స్కోరుకు టీమిండియా కూల్ కూల్గా సమాధానమిస్తోంది. రెండో రోజు ఆటలో భాగంగా శనివారం తొలుత ఇంగ్లండ్ 477 పరుగులు సాధించగా.. ఆ తరువాత విరాట్ సేన ఆచితూచి బ్యాటింగ్ చేస్తోంది. ఆట ముగిసేసమయానికి భారత్ 20.0 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 60 పరుగులు చేసి దీటుగా బదులిస్తోంది. ఈ రోజు ఆటలో ఇంగ్లండ్ పదే పదే బౌలర్లను మార్చినా భారత్ ఓపెనింగ్ జోడిని విడదీయలేకపోయింది. భారత ఓపెనర్లు కేఎల్ రాహుల్(30 బ్యాటింగ్), పార్థీవ్ పటేల్(29 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నారు.

 

అంతకుముందు 284/4 ఓవర్ నైట్ స్కోరుతో శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ 477 పరుగుల వద్ద ఆలౌటైంది.బెయిర్ స్టో(49),మొయిన్ అలీ(146), రషిద్(60),డాసన్(66 నాటౌట్)లు రాణించి ఇంగ్లండ్ భారీ స్కోరు చేయడంలో సహకరించారు. ఈ రోజు ఆట తొలి సెషన్లో భారత్ జోరు కొనసాగింది. మూడు కీలక వికెట్లను తీసి భారత్ పై చేయి సాధించింది. తొలుత బెయిర్ స్టోను అవుట్ చేసిన భారత్, ఆ తరువాత బట్లర్ను అవుట్ చేసింది. ఆపై శతకం వీరుడు మొయిన్ అలీని కూడా అవుట్ చేసింది. దాంతో లంచ్ లోపే ఇంగ్లండ్ మూడు ప్రధాన వికెట్లను కోల్పోవడంతో భారత్ శిబిరంలో ఆనందం వెల్లివిరిసింది. దాంతో ఇంగ్లండ్ 321 పరుగులకే ఏడు వికెట్లను నష్టపోయింది.

కాగా, రెండో సెషనల్ లో ఇంగ్లండ్ హవా కొనసాగింది. లంచ్ కు ముందు మొయిన్ అలీ ఏడో వికెట్గా అవుటైన తరువాత భారత్కు అసలు పరీక్ష ఎదురైంది. ఇంగ్లండ్ టెయిలెండర్లు డాసన్, రషిద్లు సమయోచితంగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. ఈ జోడి ఎనిమిదో వికెట్ కు108 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించింది. ఈ క్రమంలోనే రషిద్  హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇది రషిద్ టెస్టు కెరీర్లో రెండో హాప్ సెంచరీ. రషిద్ అవుటైన తరువాత డాసన్ హాఫ్ సెంచరీ సాధించాడు. దీంతో రెండో సెషన్లో ఇంగ్లండ్ హవా పూర్తిగా కొనసాగింది. టీ తరువాత ఇంగ్లండ్ మరో 25 పరుగులు చేసిన  తొలి ఇన్నింగ్స్ ను ముగించింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు సాధించగా, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మలు తలో రెండు వికెట్లు తీశారు. అశ్విన్, మిశ్రాలకు  చెరో వికెట్ దక్కింది.

Advertisement
 
Advertisement
Advertisement