ప్రపంచకప్‌: మళ్లీ వర్షం రావడమే మంచిదైంది

Indian Fans Happy About the First Semi Final Resuming - Sakshi

మాంచెస్టర్‌ : ప్రతిష్టాత్మక ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించిన విషయం తెలిసిందే. భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌ పూర్తికాకుండానే వరుణుడు అడ్డుపడ్డాడు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌ మ్యాచ్‌ ఆగిపోయే సమయానికి 46.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. అయితే వర్షం పలుమార్లు దోబూచులాడటం భారత అభిమానులకు తెగ టెన్షన్‌ పెట్టింది. డక్‌వర్త్‌లూయిస్‌ పద్దతిలో భారత్‌ నిర్థేశించాల్సిన లక్ష్యాలను చూసి భారత అభిమానులు కొంత కలవరపాటుకు గురయ్యారు. నిజానికి మంగళవారం మళ్లీ వర్షం రావడమే భారత్‌కు మంచిదైందని అభిమానులు, క్రికెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. (చదవండి: అపరిచిత మహిళకు షమీ మెసేజ్‌)

మ్యాచ్‌ను 20 ఓవర్లకు కుదిస్తే టీమిండియా విజయానికి 148 పరుగులు చేయాల్సి వచ్చేది. టీ20 స్టార్లు జట్టులో ఉన్నా...వర్షం ఆగిన తర్వాత పిచ్‌లో వచ్చే మార్పు, మబ్బు పట్టిన వాతావరణంలో కివీస్‌ బౌలర్లు స్వింగ్‌తో చెలరేగిపోయే ప్రమాదం ఉండేది. అదే జరిగితే భారత్‌కు ఛేదన కష్టంగా మారేది. పైగా కివీస్‌ ఆరంభం కూడా అంత బాగాలేదు. వరుస రెండు ఓవర్లు మెయిడిన్‌ అయ్యాయి. ఆ జట్టు తొలి పవర్‌ప్లేలో ఒక వికెట్‌ కోల్పోయి కేవలం 27 పరుగులు మాత్రమే చేసింది. ఈ పరిస్థితులు పిచ్‌ ఎంత కఠినంగా ఉందో తెలియజేసింది. మ్యాచ్‌ రిజర్వ్‌డేకు వాయిదా పడటంతో అభిమానులంతా కొంత ఊపిరి పీల్చుకున్నారు. బుధవారం కూడా మొత్తం ఆట సాగాలని లేకుంటే మ్యాచ్‌ రద్దు కావాలని ప్రార్ధిస్తున్నారు. (చదవండి: సెమీస్‌ సశేషం!)

వాతావరణ శాఖ అంచనా ప్రకారం మాంచెస్టర్‌లో బుధవారం కూడా పరిస్థితి అంత మెరుగ్గా ఏమీ లేదు. ఒక వేళ మ్యాచ్‌ సమయంలో మళ్లీ వర్షం పడితే కివీస్‌ ఇన్నింగ్స్‌ను అక్కడితోనే ముగించి డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం భారత్‌కు లక్ష్యాన్ని నిర్దేశించే అవకాశం ఉంది. కనీసం 20 ఓవర్ల ఆట సాధ్యమైనా డక్‌వర్త్‌ లూయిస్‌ వర్తిస్తుంది. అదీ జరగకుండా పూర్తిగా రద్దయితే మాత్రం లీగ్‌ దశలో టాప్‌ ర్యాంకులో నిలిచిన భారత్‌ ఫైనల్‌కు చేరుతుంది. (చదవండి: వరల్డ్‌కప్‌లో అరుదైన ఘట్టం!)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top