ఆసీస్‌ గడ్డపై కోహ్లిసేన డబుల్‌ ధమాకా!

India Won by 7 Wickets Against Australia in Melbourne ODI - Sakshi

మెల్‌బోర్న్‌లో మెరిసిన భారత్‌

2-1తో వన్డే సిరీస్‌ నెగ్గి చరిత్ర సృష్టించిన కోహ్లిసేన

హాఫ్‌ సెంచరీలతో ఆకట్టుకున్న ధోని, జాదవ్‌

మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ చహల్‌.. సిరీస్‌ ధోని

మెల్‌బోర్న్ : ఆస్ట్రేలియా గడ్డపై 2-1తో టెస్ట్‌ సిరీస్‌ నెగ్గి చరిత్ర సృష్టించిన టీమిండియా.. మూడు వన్డేల సిరీస్‌ను సైతం 2-1తో నెగ్గి ఈ చారిత్రక పర్యటనను ఘనంగా ముగించింది. మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన చివరి వన్డేలో కోహ్లిసేన మెరిసింది. లెగ్‌ స్పిన్నర్‌ చహల్‌ బంతితో మాయ చేస్తే.. బ్యాట్‌తో మహేంద్రసింగ్‌ ధోని(87 నాటౌట్‌: 114 బంతులు, 6 ఫోర్లు), కేదార్‌ జాదవ్‌(61 నాటౌట్‌ :57బంతులు, 7ఫోర్లు)లు కడవరకు పోరాడి భారత్‌కు విజయాన్నందించారు.

చహల్‌ మ్యాజిక్‌
టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌.. చహల్‌ (6/42) దాటికి  48.4 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది. హ్యాండ్‌స్కోంబ్‌ (58) అర్ధసెంచరీ మినహా.. అలెక్స్‌ క్యారీ(5), ఫించ్‌(14) ఖవాజా (34), షాన్‌ మార్ష్‌( 39), మ్యాక్స్‌వెల్‌ (26), రిచర్డ్‌సన్‌(16), ఫించ్‌(14), సిడిల్‌ (10)లు విఫలమయ్యారు. భారత్‌ బౌలర్లలో చహల్‌ 6 వికెట్లు తీయగా.. భువనేశ్వర్‌, షమీలు రెండేసి వికెట్లు దక్కించుకున్నారు.

231 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రెండు వన్డేల్లో రాణించిన ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (9) ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. సిడిల్‌ బౌలింగ్‌లో మార్ష్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ కోహ్లితో శిఖర్‌ ధావన్‌ జట్టు స్కోర్‌ను 50 పరుగులు దాటించాడు. ఈ తరుణంలో శిఖర్‌ (23), స్టోయినిస్‌కు రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. తర్వాత అనూహ్యంగా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ వచ్చిన ఎంఎస్‌ ధోని వచ్చిరావడంతోనే మ్యాక్స్‌వెల్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. కానీ మ్యాక్సీ జారవిడచడంతో ధోని ఊపిరి పీల్చుకున్నాడు. ధోనితో కలిసి కోహ్లి ఆచితూచి ఆడుతూ.. మూడో వికెట్‌కు 54 పరుగులు జోడించాడు. అనంతరం కోహ్లి(46) కీపర్‌ క్యారీకి క్యాచ్‌ ఇచ్చి అర్థశతకాన్ని చేజార్చుకున్నాడు.

ధోని ‘హ్యాట్రిక్‌’!
కేదార్‌ జాదవ్‌తో ధోని జాగ్రత్తగా ఆడాడు. ఈ క్రమంలో ధోని 74 బంతుల్లో 3 ఫోర్లతో కెరీర్‌లో 70వ అర్థ సెంచరీతో ఈ సిరీస్‌లో హ్యాట్రిక్‌ సాధించాడు. తొలి రెండు వన్డేల్లో ఈ జార్ఖండ్‌ డైనమైట్ అర్థసెంచరీలు సాధించిన విషయం తెలిసిందే. ఎప్పటిలానే ఎలాంటి సంబరాలు లేకుండా మరుసటి బంతికి ధోని సిద్దమయ్యాడు. ఇక ధోనికి మద్దతుగా జాదవ్‌ కూడా ఆచితూచి ఆడుతూ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 52 బంతుల్లో 5 ఫోర్లతో కెరీర్‌లో మూడో హాఫ్‌ సెంచరీ సాధించాడు. చివర్లో కొంత ఉత్కంఠ నెలకొన్నా ధోని, జాదవ్‌లు బౌండరీలు బాదడంతో భారత్‌ నాలుగు బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఆసీస్‌ బౌలర్లలో రిచర్డ్సన్‌, సిడిల్‌, స్టోయినిస్‌లకు తలో వికెట్‌ దక్కింది. ఇక ఈ మ్యాచ్‌ ప్రారంభంలో వరణుడు కొంత టెన్షన్‌ పెట్టడంతో ఆటకు కాసేపు అంతరాయ కలిగింది. ఆరు వికెట్లతో చెలరేగిన చహల్‌కు మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు వరించగా.. సిరీస్‌లో హ్యాట్రిక్‌ హాఫ్‌ సెంచరీలతో రాణించిన ధోనికి మ్యాన్‌ ఆఫ్‌ది సిరీస్‌ అవార్డు దక్కింది.

మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top