టీమిండియాపై, కోహ్లీపై రెచ్చిపోయిన కేఆర్‌కే | India will lose in either semis or final match, says KRK | Sakshi
Sakshi News home page

టీమిండియాపై, కోహ్లీపై రెచ్చిపోయిన కేఆర్‌కే

Jun 9 2017 12:46 PM | Updated on Sep 5 2017 1:12 PM

టీమిండియాపై, కోహ్లీపై రెచ్చిపోయిన కేఆర్‌కే

టీమిండియాపై, కోహ్లీపై రెచ్చిపోయిన కేఆర్‌కే

వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే బాలీవుడ్ నటుడు, విమర్శకుడు కమల్ రషీద్ ఖాన్ (కేఆర్‌కే) మరో వివాదానికి తెరతీశాడు.

ముంబై: వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే బాలీవుడ్ నటుడు, విమర్శకుడు కమల్ రషీద్ ఖాన్ (కేఆర్‌కే) మరో వివాదానికి తెరతీశాడు. శ్రీలంక చేతిలో ఓటమిని విరాట్ కోహ్లీ సేన జీర్ణించుకోలేక ఉన్న నేపథ్యంలో.. పుండు మీద కారం చల్లినట్లుగా కోహ్లీ సహా జట్టు మీద విమర్శలు గుప్పించాడు. శిఖర్ ధావన్ శతకానికి రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీలు హాఫ్ సెంచరీలు జోడించడంతో భారత్ 321 పరుగుల భారీ స్కోరు చేసి ఓడిపోవడాన్ని కేఆర్‌కే తప్పుపడుతూ వరుస ట్వీట్లతో రెచ్చిపోయాడు.

'కోహ్లీ ఓ మోసగాడు. విజయ్ మాల్యాతో కలిసి పార్టీలు చేసుకుంటే ఫలితం ఇలాగే ఉంటుంది. అయినా డకౌట్ అయిన కోహ్లీ.. ఇంకా స్కోరు చేసి ఉంటే బాగుండేది. అందుకోసం మాల్యాను పిలుస్తే బాగుంటుంది. ఇదివరకే దక్షిణాఫ్రికా పాక్ చేతిలో ఓటమితో రగిలిపోతోంది. ఆ జట్టు వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిపోతుందని భావించను. భారత్ తన తదుపరి మ్యాచ్ సఫారీలతో ఆడాల్సి ఉంటుంది. ఈ రోజు అంతా తేలిపోయింది. టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ నెగ్గదు. ఒకవేళ సఫారీలను ఓడించినా.. సెమీస్‌లో గానీ, లేక చివరి మెట్టు ఫైనల్లోనైనా భారత్ బోల్తా కొట్టడం ఖాయమని శాపనార్థాలు పెడుతూ' వివాదాస్పదుడు కేఆర్‌కే వరుస ట్వీట్లు చేశాడు.

'రెండు కోట్ల జనాభా ఉన్న లంకలో 11 మంది చాంపియన్లు దొరికారు. కానీ 130 కోట్ల భారత జనాభాలో 11 మంది విన్నర్లను బీసీసీఐ గుర్తించలేక పోయింది. ఇది కలియుగం కనుక రావణులే గెలుస్తారని లంకేయులు నిరూపించారని' కేఆర్‌కే ట్వీట్ల పర్వం కొనసాగింది. మరోవైపు కేఆర్‌కే తీరుపై భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement