రన్నరప్ భారత్
తౌరంగ (న్యూజిలాండ్): టైటిల్ పోరులో భారత హాకీ జట్టు పోరాడి ఓడింది. బెల్జియంతో ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో టీమిండియా 1–2 గోల్స్తో ఓడిపోయింది. దీంతో నాలుగు దేశాల ఇన్విటేషనల్ తొలి అంచె టోర్నీలో భారత్ రన్నరప్తో సరిపెట్టుకుంది. భారత్ తరఫున నమోదైన ఏకైక గోల్ను మన్దీప్ సింగ్ 19వ నిమిషంలో సాధించగా... టామ్ బూన్ (4వ ని.),డాకియెర్ (36వ ని.) చెరో గోల్ చేసి బెల్జియంను గెలిపించారు. నాలుగో నిమిషంలోనే బెల్జియం సఫలమైంది. బూన్ చేసిన గోల్తో 1–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తర్వాత రెండో క్వార్టర్లో భారత్కు మన్దీప్ గోల్ సాధించిపెట్టాడు. దీంతో 1–1తో స్కోరు సమమైంది. అయితే మూడో క్వార్టర్ మొదలైన ఆరు నిమిషాలకే డాకియెర్ చేసిన గోల్తో మళ్లీ బెల్జియం ఆధిక్యంలోకి వెళ్లి దానిని నిలబెట్టుకుంది. రెండో అంచె టోర్నీ ఈనెల 24న మొదలవుతుంది.