
భారత్ ఘనవిజయం
ఆసియా బధిర క్రికెట్ చాంపియన్షిప్లో భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.
331 పరుగులతో బంగ్లాదేశ్ ఓటమి ∙
ఆసియా బధిర క్రికెట్ చాంపియన్షిప్
సాక్షి, హైదరాబాద్: ఆసియా బధిర క్రికెట్ చాంపియన్షిప్లో భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. స్థానిక జింఖానా గ్రౌండ్లో బుధవారం జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా 331 పరుగులతో బంగ్లాదేశ్ను చిత్తుగా ఓడించింది. మొదట బ్యాటింగ్లో అభిషేక్ సింగ్ (72 బంతుల్లో 100; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో విజృంభించగా... తర్వాత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి జట్టుకు ఘనవిజయాన్ని అందించారు.
టాస్ గెలిచిన భారత్ తొలుత 48.3 ఓవర్లలో 396 పరుగుల భారీ స్కోరు చేసింది. అభిషేక్ సింగ్తో పాటు ఓపెనర్లు ఇంద్రజిత్ యాదవ్ (53), విపుల్ పటేల్ (49) రాణించారు. సుజీత్ (44) ధాటిగా ఆడాడు. ప్రత్యర్థి బౌలర్లలో ఇఫ్తికర్, మునీర్ సోహెల్ చెరో 4 వికెట్లను పడగొట్టగా... పయెల్, షహాదత్లకు ఒక్కో వికెట్ దక్కింది. అనంతరం 397 పరుగుల భారీ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు 19.5 ఓవర్లలో కేవలం 65 పరుగులకే కుప్పకూలింది. పయెల్ (15) మినహా ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయారు. భారత బౌలర్లలో ఉమేర్ 4 వికెట్లతో ఆకట్టుకోగా... సుజీత్, మన్ను చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు. గుర్ప్రీత్ ఒక వికెట్ పడగొట్టాడు.
మంగళవారం జరిగిన తొలిమ్యాచ్లో భారత్ 288 పరుగుల తేడాతో నేపాల్పై గెలుపొందింది. అభిషేక్ సింగ్ (95 బంతుల్లో 156 నాటౌట్; 24 ఫోర్లు, 1 సిక్సర్) అజేయ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో భారత్ 41 ఓవర్లలో 7 వికెట్లకు 347 పరుగులు చేయగా... నేపాల్ కేవలం 59 పరుగులకే ఆలౌటై ఘోరంగా ఓడిపోయింది.