‘వంద కోట్లు ఇచ్చినా ఆ పని చేయను’

I Will Never Do It Even For 100 Crores Sreesanth - Sakshi

న్యూఢిల్లీ:  గత నెలలో భారత పేసర్‌ శ్రీశాంత్‌పై ఉ‍న్న నిషేధాన్ని తగ్గిస్తూ బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలపై అతనిపై విధించిన జీవితకాల నిషేధాన్ని ఏడేళ్లకు కుదిస్తూ అంబుడ్స్‌మన్‌ డీకే జైన్‌ నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఇప్పటికే ఆరేళ్లుగా నిషేధం ఎదుర్కొంటున్న శ్రీశాంత్‌.. వచ్చే ఏడాది ఆగస్టు నెలతో నిషేధాన్ని పూర్తి చేసుకోనున్నాడు.

అయితే తాజాగా శ్రీశాంత్‌ మీడియాతో మాట్లాడుతూ.. తనపై వచ్చిన ఫిక్సింగ్‌ ఆరోపణల్ని మరోసారి ఖండించాడు. ఈ క‍్రమంలోనే ఉద్వేగానికి లోనయ్యాడు. ‘ నా పిల్లలు మీద, మా నాన్నపై ఒట్టేసి చెబుతున్నా. నేను ఎటువంటి ఫిక్సింగ్‌కు పాల్పడలేదు. నాకు ఎప్పుడూ ఆ ఆలోచన రాలేదు. రాబోదు. ఇప్పుడు మా నాన్న మంచాన పడ్డాడు. గత ఐదున్నరేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మా అమ్మ ఆరోగ్యం కూడా బాలేదు. వారిద్దరూ కనీసం నా మ్యాచ్‌ను చూసే స్థితిలో కూడా లేరు. నేను ఎప్పుడూ స్పాట్‌ ఫిక్సింగ్‌ అనేది చేయలేదు. రూ. 100 కోట్లు ఇచ్చినా ఆ పని చేయను’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. మన దేశంలో చాలా లీగ్‌లు ఉన్నాయని, తన కుటుంబాన్ని చూసుకోవాలంటే క్రికెట్‌లో పునరాగమనం చేయాల్సి ఉందన్నాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top