హాకీ ఇండియా లీగ్ విజేత ఢిల్లీ | Hockey India League final: Delhi beat Punjab 3-1 in penalty shoot-out to win the title | Sakshi
Sakshi News home page

హాకీ ఇండియా లీగ్ విజేత ఢిల్లీ

Feb 24 2014 1:17 AM | Updated on Sep 2 2017 4:01 AM

గతేడాది రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్న ఢిల్లీ వేవ్‌రైడర్స్ ఈసారి మాత్రం ఎలాంటి తప్పిదాలు చేయలేదు.

రాంచీ: గతేడాది రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్న ఢిల్లీ వేవ్‌రైడర్స్ ఈసారి మాత్రం ఎలాంటి తప్పిదాలు చేయలేదు. కీలకసమయంలో సంయమనంతో రాణించి రెండో ప్రయత్నంలో హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) విజేతగా అవతరించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత కెప్టెన్ సర్దార్ సింగ్ నాయకత్వంలోని ఢిల్లీ వేవ్‌రైడర్స్ ‘షూట్‌అవుట్’లో 3-1 గోల్స్ తేడాతో పంజాబ్ వారియర్స్‌ను ఓడిం చింది.
 
 నిర్ణీత సమయం వరకు రెండు జట్లు 3-3తో సమఉజ్జీగా నిలిచాయి.
 ‘వన్ ఆన్ వన్’ షూట్‌అవుట్‌లో ఢిల్లీ తరఫున మాట్ గోడ్స్, సిమోన్ చైల్డ్, ఎడ్వర్డ్స్ సఫలంకాగా... రాజ్‌పాల్ సింగ్ విఫలమయ్యాడు. పంజాబ్ తరఫున కెప్టెన్ జేమీ డ్వెయర్, సిమోన్ ఆర్చర్డ్, సత్బీర్ సింగ్ గురి తప్పగా... రాబ్ హామండ్ మాత్రమే బంతిని లక్ష్యానికి చేర్చాడు. నాలుగో షాట్ తర్వాత ఫలితం తేలిపోవడంతో ఐదో షాట్‌ను తీసుకోలేదు. నిర్ణీత సమయంలో ఢిల్లీ తరఫున ఆకాశ్‌దీప్ సింగ్ (33వ నిమిషంలో), సర్దార్ సింగ్ (35వ నిమిషంలో), యువరాజ్ వాల్మీకి (51వ నిమిషంలో)... పంజాబ్ తరఫున మార్క్ నోల్స్ (తొలి నిమిషంలో), శివేంద్ర సింగ్ (44వ నిమిషంలో), అఫాన్ యూసుఫ్ (47వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. విజేతగా నిలిచిన ఢిల్లీ వేవ్‌రైడర్స్‌కు రూ. 2 కోట్ల 50 లక్షలు... రన్నరప్ పంజాబ్ జట్టుకు రూ. కోటీ 25 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి.
 
 అంతకుముందు జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో గత ఏడాది విజేత రాంచీ రైనోస్ ‘షూట్‌అవుట్’లో 3-2తో ఉత్తరప్రదేశ్ విజార్డ్స్‌ను ఓడించి మూడో స్థానాన్ని దక్కించుకుంది. నిర్ణీత సమయానికి రెండు జట్లు 1-1వద్ద సమంగా నిలిచాయి. రాంచీ జట్టుకు రూ. 75 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement