బంగ్లాదేశ్‌ బోణీ 

Cricket: Bangladesh beat West Indies by 48 runs in first ODI - Sakshi

తమీమ్‌ ఇక్బాల్‌ సెంచరీ

రాణించిన షకీబ్, మోర్తజా

ప్రావిడెన్స్‌ (గయానా): ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన బంగ్లాదేశ్‌ జట్టు వెస్టిండీస్‌ పర్యటనలో తొలి విజయం నమోదు చేసింది. టెస్టు సిరీస్‌ను 0–2తో కోల్పోయిన బంగ్లాదేశ్‌ మూడు వన్డేల సిరీస్‌లో మాత్రం శుభారంభం చేసింది. ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్‌ 48 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బంగ్లాదేశ్‌ నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్లకు 279 పరుగులు సాధించింది. ఓపెనర్‌ తమీమ్‌ ఇక్బాల్‌ (160 బంతుల్లో 130 నాటౌట్‌; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ సెంచరీ చేశాడు.

షకీబ్‌ (121 బంతుల్లో 97; 6 ఫోర్లు)తో కలిసి రెండో వికెట్‌కు 207 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. చివర్లో ముష్ఫికర్‌ రహీమ్‌ (11 బంతుల్లో 30 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌) ధాటిగా ఆడాడు. 280 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 231 పరుగులు చేసి ఓడిపోయింది. గేల్‌ (40; ఒక ఫోర్, 2 సిక్స్‌లు), హెట్మైర్‌ (52; 5 ఫోర్లు) మినహా మిగతావారు విఫలమయ్యారు. బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ మోర్తజా (4/37) విండీస్‌ ఇన్నింగ్స్‌ను దెబ్బతీశాడు. రెండో వన్డే గురువారం జరుగుతుంది.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top