ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడతాం | COA Seeks Govt Permission to Host Pakistan Women | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడతాం

Jun 8 2019 2:01 PM | Updated on Jun 8 2019 2:10 PM

COA Seeks Govt Permission to Host Pakistan Women - Sakshi

ముంబై: ఐసీసీ మహిళల వన్డే చాంపియన్‌షిప్‌లో భాగంగా భారత్‌– పాకిస్తాన్‌ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ల నిర్వహణ విషయంలో భారత ప్రభుత్వ నిర్ణయానికే కట్టుబడి ఉంటామని క్రికెట్‌ పరిపాలకుల కమిటీ (సీఓఏ) అధ్యక్షుడు వినోద్‌ రాయ్‌ స్పష్టం చేశారు. 2021 ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌ అయిన ఐసీసీ మహిళల వన్డే చాంపియన్‌షిప్‌ నేపథ్యంలో భారత్‌ వేదికగా పాకిస్తాన్‌తో మూడు మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. జూలై నుంచి నవంబర్‌ మధ్య జరిగే ఈ మ్యాచ్‌లను నిర్వహించడానికి అనుమతి కోసం భారత క్రీడా మంత్రిత్వ శాఖకు బీసీసీఐ లేఖ రాసింది.

దీనిపై రాయ్‌ స్పందిస్తూ ‘భారత్‌ వేదికగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లు నిర్వహించాల్సి వచ్చిన ప్రతిసారి మేం ప్రభుత్వ అనుమతిని కోరతాం. ఈ విషయంలో వారి వైఖరికే మేం ప్రాధాన్యత ఇస్తాం. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఈ అంశంపై ఎలాంటి వివరణ రాలేదు. ముందు దీనిపై ప్రభుత్వాన్ని స్పందించనివ్వండి. తర్వాత మా నిర్ణయాన్ని ప్రకటిస్తాం’ అని అన్నారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో 2013 జనవరి నుంచి పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లకు భారత్‌ దూరంగా ఉంటోంది. కానీ ఐసీసీ ఈవెంట్ల సందర్భంగా తప్పనిసరి పరిస్థితుల్లో భారత్‌ తటస్థ వేదికలపై పాకిస్తాన్‌తో ఆడుతోంది.   

Advertisement
 
Advertisement
Advertisement