క్రికెట్‌కు గేల్‌ ‘విరామం’

Chris Gale Wanted To Take  Break From The Game For A While - Sakshi

 భారత్‌తో సిరీస్‌కు దూరం

జొహన్నెస్‌బర్గ్‌: వెస్టిండీస్‌ విధ్వంసక క్రికెటర్‌ క్రిస్‌ గేల్‌ కొంత కాలం పాటు ఆటనుంచి విరామం తీసుకోవాలని భావించాడు. ఈ విషయాన్ని విండీస్‌ క్రికెట్‌ బోర్డుకు అతను తెలియజేశాడు. దాంతో వచ్చే నెలలో జరిగే భారత పర్యటనలో గేల్‌ ఆడే అవకాశం లేదు. ఈ టూర్‌లో భాగంగా భారత్‌–వెస్టిండీస్‌ మధ్య 3 టి20లు, 3 వన్డేలు జరగనున్నాయి. ఈ ఏడాది ఇకపై తాను ఏ టోరీ్నలోనూ ఆడబోవడం లేదని అతను స్పష్టం చేశాడు. ఆ్రస్టేలియాలో జరిగే బిగ్‌బాష్‌ లీగ్, బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లకు కూడా గేల్‌ దూరం కానున్నాడు. ప్రస్తుతానికి విరామం తీసుకోవడంపైనే తన ఆలోచనలు సాగుతున్నాయని అతను చెప్పాడు.

శరీరాన్ని ‘రీచార్జ్‌’ చేసుకొని వచ్చే సంవత్సరం కెరీర్‌ కొనసాగించే విషయంపై నిర్ణయం తీసుకుంటానని వెల్లడించిన గేల్‌... 2020 టి20 ప్రపంచ కప్‌లో ఆడటం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. 40 ఏళ్ల గేల్‌ ఆదివారం తన చివరి మ్యాచ్‌ను దక్షిణాఫ్రికా ఎంజాన్సీ సూపర్‌ లీగ్‌లో ఆడాడు. ఈ టోరీ్నలో పూర్తిగా విఫలమైన అతను 6 ఇన్నింగ్స్‌లలో కలిపి 101 పరుగులే చేశాడు. ఈ నేపథ్యంలో అతను ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఫ్రాంచైజీ క్రికెట్‌లో నేను ఒకటి రెండు మ్యాచ్‌లలో విఫలమైతే ప్రతీ జట్టు నన్నూ భారంగా భావిస్తూ ఉంటుంది. నాకు తగిన గౌరవం దక్కదు. అప్పటి వరకు నేను జట్టుకు చేసిందంతా అందరూ మర్చిపోతారు. అయితే వీటికి అలవాటు పడటం నేర్చుకున్నాను’ అని గేల్‌ అన్నాడు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top