బుమ్రా అరుదైన ఘనత

Bumrah Becomes Second Indian Bowler To Fewest Odis To 100 Wickets - Sakshi

లీడ్స్‌: టీమిండియా ప్రధాన పేస్‌ ఆయుధం జస్‌ప్రీత్‌ బుమ్రా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో కరుణరత్నేను ఔట్‌ చేయడం ద్వారా బుమ్రా వందో వికెట్‌ను సాధించాడు. ఫలితంగా భారత్‌ తరఫున ఆ ఫీట్‌ను వేగవంతంగా సాధించిన రెండో బౌలర్‌ బుమ్రా గుర్తింపు పొందాడు. తన 57వ వన్డే మ్యాచ్‌లో బుమ్రా వందో వికెట్‌ మైలురాయిని అందుకున్నాడు. ఈ జాబితాలో తొలి స్థానంలో మహ్మద్‌ షమీ ఉన్నాడు. షమీ 56 వన్డేల్లో ఈ మార్కును చేరగా, బుమ్రా తర్వాత స్థానంలో నిలిచాడు. ఇక ఇర్ఫాన్‌ పఠాన్‌(59), జహీర్‌ ఖాన్‌(65), అజిత్‌ అగార్కర్‌(67), జవగళ్‌ శ్రీనాధ్‌(68)లు తర్వాత స్థానాల్లో ఉన్నారు.

తాజా వరల్డ్‌కప్‌లో లంకేయులతో భారత్‌ తన చివరి లీగ్‌ మ్యాచ్‌ ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన శ్రీలంక ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకుంది. కాగా, లంక 40 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు కరుణరత్నే(10) తొలి వికెట్‌గా ఔట్‌ కాగా, కుశాల్‌ పెరీరా(18) రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఈ రెండు వికెట్లను బుమ్రానే సాధించాడు.


 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top