మూడో టెస్టులో దారుణంగా దెబ్బతిన్న భారత జట్టుకు తమ పేసర్ల గాయాలు మరింతగా కుంగదీస్తున్నాయి.
సౌతాంప్టన్: మూడో టెస్టులో దారుణంగా దెబ్బతిన్న భారత జట్టుకు తమ పేసర్ల గాయాలు మరింతగా కుంగదీస్తున్నాయి. ఈనెల 7 నుంచి ఓల్డ్ ట్రాఫోర్డ్లో జరిగే నాలుగో టెస్టుకు కూడా ఇషాంత్ శర్మ గాయం కారణంగా దూరమవగా తాజాగా సిరీస్లో నిలకడగా రాణిస్తున్న పేసర్ భువనేశ్వర్ ఫిట్నెస్ టీమ్ మేనేజిమెంట్ను ఆందోళనకు గురి చేస్తోంది.
అతడు కూడా మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. మ్యాచ్కు ఇంకా ఐదు రోజుల సమయం ఉండడంతో ఈ యూపీ బౌలర్ తిరిగి ఫిట్నెస్ అందుకుంటాడనే నమ్మకాన్ని కెప్టెన్ ధోని వ్యక్తం చేస్తున్నాడు. సిరీస్లో ఇప్పటిదాకా తను 124.5 ఓవర్లు బౌలింగ్ చేశాడని, ఇది కూడా అలసి పోవడానికి కారణం కావచ్చని కెప్టెన్ చెప్పాడు. అయితే ఇషాంత్ మాత్రం ఐదో టెస్టుకు అందుబాటులో ఉండే అవకాశం ఉందని తెలిపాడు.