
'టీమిండియాపై ప్రతీకారం తీర్చుకుంటాం'
తమతో జరిగే టెస్టు సిరీస్ లో టీమిండియాకు పరాభవం తప్పదని ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ అభిప్రాయపడ్డాడు.
అడిలైడ్: తమతో జరిగే టెస్టు సిరీస్ లో టీమిండియాకు పరాభవం తప్పదని ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ అభిప్రాయపడ్డాడు. మంగళవారం నుంచి ఆరంభకానున్న టెస్ట్ సిరీస్ కు ఆసీస్ ఆటగాళ్లంతా పూర్తి స్థాయిలో సన్నద్ధమైనట్లు స్పష్టం చేశాడు. ఈ సిరీస్ లో టీమిండియా తీవ్ర నిరాశ ఎదురుకాక తప్పదంటూ జోస్యం చెప్పాడు. ఫిలిఫ్ హ్యూస్ మరణానంతరం అడిలైడ్ లో జరిగే తొలి టెస్టుకు తీవ్ర ప్రాక్టీస్ చేసిన ఆసీస్.. భారత్ ను మట్టికరిపించేదుకు సిద్దంగా ఉందన్నాడు.
గత సంవత్సరం భారత్ లో 0-4 తేడాతో సిరీస్ ను కోల్పోయిన ఆస్ట్రేలియా ఈసారి మాత్రం ఆ అవకాశం ఇవ్వదని హెచ్చరించాడు. ఆ సిరీస్ లో ఘోర ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటామన్నాడు. తాను ఎప్పటికీ ఆసీస్ క్రికెట్ లో కీలక పాత్ర పోషించాలని కోరుకుంటున్నట్లు వాట్సన్ తెలిపాడు. తమ దగ్గర భారత్ ను కట్టడి చేసే ఆయుధాలు ఉన్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. ' టీమిండియాను ఎలా నిలువరించాలో మాకు తెలుసు. అందుకు సంబంధించి పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాం. ఈసారి బాల్ తోనూ, బ్యాట్ తోనూ భారత్ కు సమాధానం చెబుతాం'అని వాట్సన్ స్పష్టం చేశాడు.