
ఢిల్లీ: భారత్తో మూడో టెస్టులో శ్రీలంక ఆటగాళ్లు మాథ్యూస్-చండిమాల్ సుదీర్ఘ భాగస్వామ్యానికి ఎట్టకేలకు తెరపడింది. ఈ రోజు ఆటలో రెండు సెషన్లు పాటు భారత్ జట్టుకు పరీక్ష పెట్టిన ఈ జోడిని చివరకు అశ్విన్ విడగొట్టాడు. అశ్విన్ వేసిన ఇన్నింగ్స్ 98 ఓవర్ చివరి బంతికి సాహాకు క్యాచ్ ఇచ్చిన మాథ్యూస్(111) పెవిలియన్ చేరాడు. దాంతో వీరి 181 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది.
ఆపై మరో నాలుగు ఓవర్లు వేసిన తరువాత టీ బ్రేక్ ఇచ్చాడు. మూడో రోజు టీ విరామానికి లంక జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. ప్రస్తుతం చండిమాల్(98 బ్యాటింగ్), సదీరా(4 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నాడు. మాథ్యూస్-చండిమాల్ దాదాపు 50 ఓవర్లకు పైగా ఆడటంతో లంకేయలు గాడిలో పడ్డారు. 131/3 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం ఇన్నింగ్స్ ను ఆరంభించిన వీరిద్దరూ నిలకడగా బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలోనే మాథ్యూస్ 231 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో శతకం సాధించాడు.