కరువు రైతుపై కనికరం లేని ప్రభుత్వం | Visweswara Reddy Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

కరువు రైతుపై కనికరం లేని ప్రభుత్వం

Aug 23 2018 12:58 PM | Updated on Aug 23 2018 12:58 PM

Visweswara Reddy Slams Chandrababu Naidu - Sakshi

మాట్లాడుతున్న ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి

‘‘కరువుతో రైతాంగం విలవిల్లాడుతోంది. ఈ పరిస్థితుల్లో కనీస మానవత్వంచూపాల్సిన ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలకే పరిమితమైంది.’’ అని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ     ఏపీ రైతు సంఘం, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం అనంతపురం ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌ టేబుల్‌     సమావేశం నిర్వహించారు.

అనంతపురం రూరల్‌: ‘‘కరువుతో రైతాంగం విలవిల్లాడుతోంది. ఈ పరిస్థితుల్లో కనీస మానవత్వం చూపాల్సిన ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలకే పరిమితమైంది.’’ అని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ రైతు సంఘం, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్సీ గేయానంద్, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి శరత్‌చంద్రారెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌ పాల్గొన్నారు. విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ వాతావరణ బీమా కింద దాదాపు రూ.300 కోట్ల ప్రీమియాన్ని రైతులు బ్యాంకులకు చెల్లిస్తే అందులో సగం కూడా బీమా రూపంలో రైతులకు అందడం లేదన్నారు. వ్యవసాయ రంగంలో 15 శాతం వృద్ధి సాధించినట్లు ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని, అదే జరిగితే లక్షల ఎకరాలు ఎందుకు బీళ్లుగా మారుతాయో సమాధానం చెప్పాలన్నారు. తీవ్ర కరువుతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వానికి కనిపించకపోవడం శోచనీయమన్నారు.

ఈ పరిస్థితుల్లో రైతులకు అండగా నిలవాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు సహజ మరణాలుగా చూపించే ప్రయత్నం చేస్తుండటం సిగ్గుచేటన్నారు. హంద్రీనీవా ద్వారా ఆయకట్టుకు నీరివ్వకుండా కేవలం చెరువులు, కుంటలను నింపి రైతులను మభ్యపెడుతున్నారన్నారు. హంద్రీనీవా నీటిని కుప్పంకు తరలించే ఉద్దేశంతోనే అనంత రైతులకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నాడన్నారు. పీఏబీఆర్‌ కింద 50వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సి ఉండగా ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదన్నారు. హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రూ.500 కోట్లు కేటాయించారని.. టీడీపీ ప్రభుత్వం ఆధునికీకరణ పనులను నత్తనడకన సాగిస్తుండటంతో చాలా చోట్ల నీళ్లు వృథా అవుతున్నాయన్నారు. అదేవిధంగా తుంగభద్ర డ్యాం నీళ్లను తీసుకురావడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కార్యక్రమంలో ఏపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు బోయ నరేంద్ర, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బాలరంగయ్య, సీఐటీయూ జిల్లా కార్యదర్శి నాగరాజు, రైతు విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు రామాంజినేయులు, మానవ హక్కుల వేదిక బాషా, సరస్వతి, కేవీపీఎస్‌ నల్లప్ప పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement