అన్ని జెడ్పీటీసీ స్థానాలు టీఆర్‌ఎస్‌ పార్టీవే..

TRS Wins All ZPTC Seats In Siddipet Says Harish Rao - Sakshi

దుబ్బాకటౌన్‌: ప్రాదేశిక ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు.  దుబ్బాక మండలం  చిట్టాపూర్‌లో గురువారం ఆయన ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిలతో కలిసి విలేకర్లతో మాట్లాడారు.  మంచి పేరు ప్రజల్లో గుర్తింపు ఉన్న వారికే టికెట్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. టికెట్లు రాని కార్యకర్తలు నిరుత్సాహం చెందొద్దని పార్టీకోసం సేవ చేసిన వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు. వారికి నామినేట్‌ పదవుల్లో అవకాశం కల్పిస్తామన్నారు. ఎన్నికలేవైనా ప్రజలు కారు గుర్తుకు ఓట్లు వేస్తారన్నారు. త్వరలో జరుగబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలు పూర్తిగా ఏకపక్షంగానే జరుగుతాయన్నారు.

తెలంగాణలోని అన్ని జిల్లా పరిషత్‌ చైర్మన్లు టీఆర్‌ఎస్‌ ఖాతాలోకే వస్తాయన్నారు. ఎంపీటీసీలు కూడ  అదే స్థాయిలో టీఆర్‌ఎస్‌ గెలుస్తుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కూడా పునరావృతం అవుతాయన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో 16 ఎంపీ సీట్లు గెలిచి మే 23 తర్వాత కేంద్రంలో ఏర్పడబోయే కేంద్ర ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తుందన్నారు. అలాగే మెదక్‌ ఎంపీగా కొత్త ప్రభాకర్‌రెడ్డి రికార్డు స్థాయి మెజార్టీతో గెలువబోతున్నాడన్నారు. నాలుగు నుంచి 5 లక్షలకు పైగా మెజార్టీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top