కేసీఆర్‌.. నయా నిజాం | Swami Paripoornananda Comments On KCR | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌.. నయా నిజాం

Nov 27 2018 2:45 AM | Updated on Nov 27 2018 2:45 AM

Swami Paripoornananda Comments On KCR - Sakshi

కొత్తగూడెం రోడ్‌షోలో మాట్లాడుతున్న పరిపూర్ణానంద స్వామి

సాక్షి, కొత్తగూడెం:  తెలంగాణ ప్రజలు నమ్మి అధికారం అప్పగిస్తే సీఎం కేసీఆర్‌ నయా నిజాంలా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేత స్వామి పరిపూర్ణానంద అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు, భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెంలలో జరిగిన రోడ్‌షోలలో మాట్లాడారు. కొందరు శ్రీరాముడిని నోటికొచ్చినట్లు తూలనాడితే అది సరికాదన్న తనను కేసీఆర్‌ రాష్ట్రం నుంచి బహిష్కరించారని అన్నారు. తనను కాకినాడకు తరలించే క్రమంలో భద్రాచలం రాముడిని దర్శించుకుంటానని చెప్పినా అనుమతించలేదని చెప్పారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో భద్రాచలం ప్రజలకు భద్రత లేకుండా పోయిందన్నారు.

ఈ జిల్లాలో గిరిజనులు అనేక సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూములను కేసీఆర్‌ ప్రభుత్వం లాక్కుని వారికి అన్యాయం చేసిందని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే గిరిజనులకు పట్టాలిస్తామన్నారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమం రాజ్యమేలుతోందని ఆరోపించారు. రామాయణం సర్క్యూట్‌ కింద ఖర్చు చేయాల్సిన రూ.100 కోట్లను మంత్రి తుమ్మల ఇతర ప్రాంతాల్లో ఉపయోగించారని అన్నారు. రాష్ట్రంలోని ఆదిలాబాద్‌ నుంచి కొత్తగూడెం జిల్లా వరకు ఉన్న సుమారు 30 వేల మంది గిరిజన పూజారులకు బీజేపీ అధికారంలోకి వచ్చాక గౌరవవేతనం ఇస్తామని, భద్రాచలంలో నిర్వహించే ప్రతి కార్యక్రమంలో గిరిజనులకు, ఎస్సీలకు ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించారు. 

Advertisement
 
Advertisement
Advertisement