సబ్బం.. ప్రలోభాలతో పబ్బం | Sabbam Hari Audio Leaked | Sakshi
Sakshi News home page

సబ్బం.. ప్రలోభాలతో పబ్బం

May 2 2019 5:04 AM | Updated on May 2 2019 7:13 AM

Sabbam Hari Audio Leaked - Sakshi

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఓట్ల కోసం అన్ని అడ్డదారులు తొక్కిన అధికార తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోలింగ్‌ ముగిశాక ఇప్పుడు ప్రభుత్వోద్యోగుల పోస్టల్‌ ఓట్ల కోసం బరితెగించారు. ఇప్పటికే పలువురు టీడీపీ అభ్యర్థులు ఒక్కో ఉద్యోగి పోస్టల్‌ ఓటు కొనుగోలుకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఎరచూపుతూ వచ్చారు. తాజాగా భీమిలి టీడీపీ అభ్యర్థి సబ్బం హరి ఏకంగా ఒకేసారి 500 మంది ఉద్యోగులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి ప్రలోభాలకు గురిచేయడం కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన ఆడియో టేప్‌ బయటపడటం వివాదాస్పదమైంది. ఆ ఆడియోలో ‘భీమిలిలో 3 వేల వరకు పోస్టల్‌ ఓట్లు ఉన్నాయని లెక్క తేలింది. మీరందరూ ఎన్నికల వేళ బిజీగా ఉన్నారు.

మీరు నన్ను వైజాగ్‌ లేదా భీమిలిలో కలవచ్చు. నలుగురైదుగురుగా వచ్చి కలవండి. అన్నీ మాట్లాడుకుందాం’ అని సబ్బం చెప్పుకొచ్చారు. పోస్టల్‌ ఓట్లున్న ఉద్యోగుల జాబితా సబ్బం హరికి ఎక్కడి నుంచి వచ్చిందనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. టీడీపీ నేతలకు జిల్లా కలెక్టరేట్‌లోని కొందరు అధికారులు జాబితాను అందించారని తెలిసింది. ఇదే జాబితాను తాము స్వయంగా కలిసి అడిగినా ఇవ్వలేదని, సబ్బం హరికి ఎలా ఇచ్చారని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు ప్రశ్నించారు. ఉద్యోగుల పేర్లతో పాటు ఫోన్‌ నెంబర్లు కూడా ఇవ్వడం దారుణమని, ఈ వ్యవహారంపై జిల్లా అధికారులు వెంటనే వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. జిల్లా వ్యాప్తంగా పోస్టల్‌ ఓట్ల వివరాలను టీడీపీ అభ్యర్థులందరికీ ఇచ్చారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement