రేవంత్‌ రెడ్డి వర్సెస్‌ జగదీశ్‌ రెడ్డి

Revanth Reddy Versus Jagadishwar Reddy at NATA Political Debate - Sakshi

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: పెన్సిల్వేనియాలో(యూఎస్‌ఏ) జరిగిన నాటా(NATA) పొలిటికల్‌ డిబేట్‌(తెలంగాణ) రసాభాసగా ముగిసింది. తెలంగాణ మంత్రి జగదీశ్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకానొక పరిస్థితిలో పరిస్థితి చెయ్యి దాటి ఉద్రిక్తంగా మారింది. మంత్రి జగదీశ్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నేతలు మధు యాష్కీ, రేవంత్‌రెడ్డి, బీజేపీ నేత కృష్ణ సాగర్‌, మరికొందరు నేతలు ఈ డిబేట్‌లో పాల్గొన్నారు. అయితే విపక్ష నేతలు టీఆర్‌ఎస్‌ పాలనపై విమర్శలు చేసిన క్రమంలో వ్యవహారం కాస్త ముదిరింది. 

టీఆర్‌ఎస్‌ పాలనపై విమర్శలు... చర్చాకార్యక్రమంలో ముందుగా మధు యాష్కీ మాట్లాడుతూ ప్రాజెక్టుల రీ డిజైన్‌ వ్యవహారంపై మండిపడ్డారు. ‘ప్రాజెక్టుల రీ డిజైన్‌ పేరిట కోట్ల ప్రజా ధనాన్ని టీఆర్‌ఎస్‌ సర్కార్‌ వృధా చేస్తోంది. ఇది ఎంత వరకు సమంజసం?.. మిషన్‌ కాకతీయ భవిష్యత్‌లో మిషన్‌ కల్వకుంట్ల కాకూడదని కోరుకుంటున్నాం. తెలంగాణ ఇచ్చిన క్రెడిట్‌ కాంగ్రెస్‌దే. హైదరాబాద్‌ లేకుండా తెలంగాణ ఏర్పాటు చేయబోమని సోనియా ఆనాడే స్పష్టం చేశారు. ఉద్యమంలో ఎన్నారైలు కూడా కీలక పాత్ర పోషించారు. కానీ, కేసీఆర్‌ ఆ క్రెడిట్‌ మొత్తం లాగేసుకున్నారు.’ అని విమర్శించారు. దీనికి మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి స్పందిస్తూ కాంగ్రెస్‌ నేతల ఆరోపణలు పస లేనివని.. గాంధీభవన్‌ నుంచి వచ్చే విమర్శలను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. బీజేపీ నేత కృష్ణ సాగర్‌ మాట్లాడుతూ... ‘సీఎం కేసీఆర్ అసలు సచివాలయానికి రావట్లేదు. ఆయన వర్క్ ఫ్రమ్‌ హోమ్ అయ్యారు. అది వర్క్ ఫర్ హోమ్ కూడా’ అని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి జోక్యం చేసుకోవటంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఒకానోక టైంలో రేవంత్‌-జగదీశ్‌లు వ్యక్తిగత ఆరోపణలు చేసుకోవటంతో డిబేట్‌ వేడెక్కింది. వారిని శాంతిపజేసేందుకు సీనియర్‌ పాత్రికేయుడు కొమ్మినేని హోస్ట్(సాక్షి కన్సల్టెంట్ ఎడిటర్) ప్రయత్నించినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు. ఈ క్రమంలో తమపైనా దురుసు వ్యాఖ్యలు చేశారంటూ ఎన్నారైలు ఆందోళనకు దిగారు. దీంతో నిర్వాహకులు పోలీసులను పిలిపించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top