‘కేటీఆర్‌ బామ్మర్ది బ్రోకర్‌ పని చేస్తున్నాడా’

Revanth Reddy Critics KCR And KTR Over Musical Night Party - Sakshi

మ్యూజికల్‌ నైట్‌ ఈవెంట్‌ అయితే గోప్యం ఎందుకు

కేసీఆర్‌, కేటీఆర్‌పై రేవంత్‌ ధ్వజం

సాక్షి, హైదరాబాద్‌ : కేసీఆర్ బంధువులు బ్రోకర్‌ అవతారమెత్తారని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. వారికి సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, మంత్రి కేటీఆర్‌ దన్నుగా నిలుస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ను డ్రగ్స్‌కు అడ్డాగా మార్చారని మండిపడ్డారు. రేవంత్‌ శనివారం మీడియాతో మాట్లాడారు. కేటీఆర్‌ బామ్మర్దికి చెందిన ‘ఈవెంట్స్‌ నౌ’ అనే సంస్థ యువతులతో వ్యాపారం చేస్తోందని ఆరోపణలు గుప్పించారు. మ్యూజిక్‌ నైట్స్‌ పేరుతో బ్రోకర్‌ పనులు చేస్తున్నారని విమర్శించారు.

మేమే అడ్డుకుంటాం..
శనివారం సాయంత్రం గచ్చిబౌలి స్టేడియంలో ‘సెస్సేషన్‌ ఈవెంట్‌’ నిర్వహించే మ్యూజికల్‌ నైట్‌ పార్టీపై ఈసీ చర్యలు తీసుకోవాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు. లేదంటే, ఎస్‌యూఐ, యూత్‌ కాంగ్రెస్‌ నేతలు రంగంలోకి దిగుతారని హెచ్చరించారు. అవసరమైతే తానే స్వయంగా  గచ్చిబౌలి వెళ్లి సెన్సేషన్‌ ఈవెంట్‌ను అడ్డుకుంటాని అన్నారు. అయినా, గోవా, ముంబయ్‌, పుణెల్లో నిషేదించిన మ్యూజికల్ నైట్స్‌కు హైదరాబాద్‌లో ఎలా అనుమతిస్తారని అన్నారు. 

డీలర్ల కోసమే..
కేటీఆర్‌ బామ్మర్ది రాజ్‌ పాకాల డేటింగ్‌ క్లబ్‌ నిర్వహిస్తున్నాడని రేవంత్‌ ఆరోపించారు. లేకుంటే పోలీసు పహరాలో మ్యూజికల్‌ నైట్స్‌ నిర్వహించాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. డ్రగ్స్ అమ్మకానికి, డీలర్లను ఏర్పాటు చేసుకోవటానికే ఇలాంటి పార్టీలు పెడుతున్నారని మండిపడ్డారు. ఈవెంట్‌లో పాల్గొనేందుకు ఒక్కక్కరి దగ్గర  లక్ష నుంచి 5 లక్షల వసూలు చేస్తున్నారంటేనే అక్కడ ఏం జరుగుతుందో ఊహించుకోవచ్చని అన్నారు. కేటీఆర్‌ బంధువులైన మాదాపూర్‌ డీసీపీ, ఏసీపీ ఈ ఈవెంట్‌కు పహారా కాస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే ఇలాంటి నీచమైన పనులు చేస్తోంటే రాష్ట్రం ఏమైపోతుందని అన్నారు. 

అందుకే విచారణ ఆపేశారు.
గతేడాది హైదరాబాద్‌ నగరంలో కలకలం సృష్టించిన బార్లు, పబ్‌లలో మాదక ద్రవ్యాల అమ్మకాలపై హడావుడి చేసిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇప్పుడెందుకు మౌనంగా ఉందని రేవంత్‌ ప్రశ్నించారు. అకున్‌ సబర్వాల్‌ నేతృత్వంలో పలువురు ప్రముఖులను విచారించిన వివేదికలు బయటపెట్టాని డిమాండ్‌ చేశారు. డ్రగ్స్‌ ముఠాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ బంధువర్గం కూడా ఉండడంతో మాదక ద్రవ్యాల ఉదంతంపై విచారణ పక్కన పెట్టారని అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top