
ములుగు సభలో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి.. హాజరైన జనం
సాక్షి, భూపాలపల్లి/గంగాధర (చొప్పదండి): కేసీఆర్ ఉద్యోగం ఊడగొట్టండి.. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో లక్ష ఉద్యోగాలు ఇస్తామని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగులో, కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధరలో ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు. ‘తెలంగాణ రాష్ట్రం వచ్చాక టీఆర్ఎస్కు ఒకసారి అవకాశం ఇచ్చి మోసపోయాం. మరోసారి అవకాశం ఇస్తే ఐదేళ్లపాటు గోస తప్పదు..’అని హెచ్చరించారు. మందేసి మోటార్ సైకిల్ నడిపితే కేసులు అవుతున్నాయని, అలాంటిది కేసీఆర్ మందేసి రాష్ట్రాన్ని నడుపుతున్నాడని తీవ్రంగా విమర్శించారు.
ప్రజాకూటమి గెలిస్తే ప్రజలు గెలిచినట్టని, కేసీఆర్ గెలిస్తే తెలంగాణ ఓడినట్లు అని పేర్కొన్నారు. ప్రాజెక్టుల రీ డిజైన్ పేరుతో కేసీఆర్ కుటుంబం వేల కోట్లు దోచుకుందని ఆరోపించారు. దేశంలో అధిక ఆదాయం కలిగిన తెలంగాణ రాష్ట్రాన్ని ఐదేళ్లలో అప్పుల పాలు చేశారని దుయ్యబట్టారు. ఇంటికి నల్లా నీరు, ఇంటికో ఉద్యోగం అన్న కేసీఆర్ ఊరికో కోడిని, ఇంటికో ఈక ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. దళిత, గిరిజనులకు మూడెకరాలు ఇస్తామన్న కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు. గిరిజనులను లాఠీలతో కొట్టించిన చరిత్ర టీఆర్ఎస్దేనని రేవంత్ విమర్శించారు.పాజెక్టులన్నీ ప్రారంభించింది కాంగ్రెసే అన్నారు. 106 సీట్లు వస్తాయని చిలుక జోస్యం చెబుతున్న కేసీఆర్.. ఎందుకు ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. అధికారులు కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారని, అధికారంలో కొచ్చాక వారికి మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.
వందరోజుల్లో రుణమాఫీ : మహాకూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వంద రోజుల్లో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. పేదలైన ప్రతి ఇంటికీ ఉచితంగా ఏడాదికి 6 వంటగ్యాస్ సిలిండర్లు ఇస్తామని, డ్వాక్రా సంఘాలకు రూ.లక్ష ఉచితంగా ఇవ్వడంతో పాటు పది లక్షల వరకు రుణాలు అందిస్తామని చెప్పారు.
రాబోయే ప్రభుత్వంలో సీతక్క కీలకపాత్ర
రాబోయే మçహాకూటమి ప్రభుత్వంలో సీతక్క కీలకపాత్ర పోషిస్తుందని రేవంత్రెడ్డి అన్నారు. ములుగులో సాటి గిరిజనుల ఇళ్లు కూల్చి వారు రోడ్డుపాలైతే రాక్షసానందాన్ని పొందిన వ్యక్తి మంత్రి చందూలాల్ అని ధ్వజమెత్తారు. అలాగే.. కరీంనగర్ జిల్లా చొప్పదండి మహాకూటమి అభ్యర్థి మేడిపల్లి సత్యంను గెలిపించాలని ఆయన కోరారు.