అది రజనీకి మాత్రమే సాధ్యం..
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాలపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, దివంగత కరుణానిధి కుమారుడు అళగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నాయకత్వ లోటు ఉందని, ప్రజలను ఆదుకునేందుకు ఓ నాయకుడు కావాలని అన్నారు. అది సూపర్ స్టార్ రజనీకాంత్తో మాత్రమే సాధ్యమని ఆళగిరి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన ఓ సమావేశంలో మాట్లాడూతూ.. డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ విపక్ష నేతగా విఫలమయ్యారని విమర్శించారు. అలాగే ప్రజల సమస్యలపై అన్నాడీఎంకే ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాజకీయ సంక్షోభం దిశగా రాష్ట్రం అడుగులు వేస్తోందని, ఈ దశలోనే రజనీకాంత్ లాంటి వ్యక్తి రాష్ట్రాన్ని ముందుండు నడిపించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ సామర్థ్యం ఆయనకు మాత్రమే ఉందన్నారు.
కాగా పార్టీ వ్యతిరేక కార్యాకలపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో అళగిరిని డీఎంకే నుంచి కరుణానిధి బహిష్కరించిన విషయం తెలిసిందే. అయితే కరణానిధి మరణాంతరం తిరిగి డీఎంకే పగ్గాలు చేపట్టాలని తీవ్రంగా ప్రయత్నించారు. కానీ అప్పటికే రాజకీయంగా నిలదొక్కుకున్న స్టాలిన్ ఆళగిరిని పార్టీ నీడ కూడా తాకనీయలేదు. అయితే అళగిరి బీజేపీలో చేరతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలతో బుధవారం భేటీ అయిన ఆయన.. రజనీ గురించి ఈ విధంగా వ్యాఖ్యానించారు. కాగా రజనీ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వస్తారని గత కొంతకాలంగా పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. కానీ అవేవీ నిజం కాలేదు.
సంబంధిత వార్తలు