‘చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తున్నారని కోడెల వాపోయారు’

Purighalla Raghuram Comments On Kodela Siva Prasada Rao - Sakshi

బీజేపీ నేత పురిఘళ్ల రఘురామ్‌

సాక్షి, అమరావతి: మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మృతి పట్ల బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఢిల్లీలో ఆ పార్టీ కో–ఆర్డినేటర్‌ పురిఘళ్ల రఘురామ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో తనకు ఎటువంటి విలువ ఇవ్వకపోవడం పట్ల కోడెల తీవ్ర మనోవేదనకు గురయ్యారని, నెలరోజుల క్రితం ఆయన తనకు ఫోన్‌ చేసి మనసులోని ఆవేదనను తనతో పంచుకున్నారని, ఇంతలోనే ఆయన ఇలా మృతి చెందడం ఎంతో బాధ కలిగిస్తోందని రఘురాం అన్నారు. కోడెల మృతిపై రఘురామ్‌ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని తనతో మాట్లాడిన సందర్భంగా మాజీ స్పీకర్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారని, నిజాయితీతో పనిచేసే నాయకులకు టీడీపీలో విలువలేదని చెప్పారని బీజేపీ నేత తెలిపారు. పార్టీలో తనను పూర్తిగా ఒంటరిని చేయడం మానసిక క్షోభను కలిగిస్తోందని ఆయన చెప్పారన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీలో చేరుతానని కోడెల అంటూ.. అమిత్‌ షాను కలవాలని అనుకుంటున్నట్టు చెప్పారని రఘురామ్‌ వివరించారు. అయితే అమిత్‌ షాను కలువకుండానే కోడెల మృతి చెందడం దురదృష్టకరమన్నారు. మాజీ స్పీకర్‌ మృతిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు సమగ్ర దర్యాప్తు చేయించాలని పురిఘళ్ల డిమాండ్‌ చేశారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top