ఖైరతాబాద్‌లో ఉద్రిక్తత | Manne Govardhan Reddy Activist Protest on Hoarding In Hyderabad | Sakshi
Sakshi News home page

ఖైరతాబాద్‌లో ఉద్రిక్తత

Nov 14 2018 8:47 AM | Updated on Nov 14 2018 11:37 AM

Manne Govardhan Reddy Activist Protest on Hoarding In Hyderabad - Sakshi

హోర్డింగ్‌ ఎక్కి నిరసన తెలుపుతున్న నేతలు

బంజారాహిల్స్‌: టీఆర్‌ఎస్‌ ఖైరతాబాద్‌ టికెట్‌ను మన్నె గోవర్ధన్‌రెడ్డికి కేటాయించాలంటూ ఆయన అనుచరులు, మద్దతుదారులు ఆందోళనలు చేస్తున్న విషయం విదితమే. వరుసగా రెండోరోజు మంగళవారం తెలంగాణ భవన్‌ ఎదుట ఆందోళన చేసేందుకు ‘మన్నె’ ఇంటి దగ్గరి నుంచి వెళ్తుండగా బంజారాహిల్స్‌ పోలీసులు కార్యకర్తను అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. కార్యకర్తలు ముందుకు వెళ్లకుండా తాడు ఏర్పాటు చేయగా, దాటుకొని వెళ్లేందుకు ప్రయత్నించగా తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అదే సమయంలో గోవర్ధన్‌రెడ్డి కూడా అటువైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే జరిగిన తోపులాటలో ఆయన ఒక్కసారిగా అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను సమీపంలోని సిటీ న్యూరో ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గోవర్ధన్‌రెడ్డి
వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. తమ నేతకు గుండెపోటు వచ్చిందని, రోడ్డుపై కుప్పకూలిపోయాడని తెలుసుకున్న టీఆర్‌ఎస్‌ నేత, ఎన్బీటీనగర్‌ వాసి సత్యనారాయణ రాయితో తలబాదుకుంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో రక్తస్త్రావం జరిగి ఆయన కూడా కుప్పకూలిపోయారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకున్న టీఆర్‌ఎస్‌వీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఖైరతాబాద్‌లోని పెరిక భవన్‌ పక్కన హోర్డింగ్‌ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. గోవర్ధన్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. పోలీసులు ఎక్కడికక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. గోవర్ధన్‌రెడ్డి ఆస్పత్రిలో చేరిన విషయం తెలుసుకున్న కార్యకర్తలు భారీగా ఆస్పత్రి దగ్గరికి చేరుకొని నినాదాలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement