‘నాకు ఓటేసి నా ఇజ్జత్‌ కాపాడండి’ | Sakshi
Sakshi News home page

‘నాకు ఓటేసి నా ఇజ్జత్‌ కాపాడండి’

Published Tue, Oct 23 2018 3:36 PM

Madhya Pradesh Congress MLA urges voters Video Viral - Sakshi

భోపాల్‌ : ఐదేళ్లు జనాలను పట్టించుకోని నేతలు ఎన్నికల సమయంలో మాత్రం ఓటర్లను దేవుళ్లుగా పూజిస్తారు. ఓట్ల కోసం పడరాని పాట్లు పడుతూ.. రకరకాల ఫీట్లు చేస్తుంటారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. ప్రచారం కూడా జోరందుకుంది. ఎన్నికల ప్రచారంలో ఏ అభ్యర్థి అయినా నన్ను, నా పార్టీని గెలిపించండి అంటూ ఓటర్లను అడుక్కోవడం సాధరణం. కానీ మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి మాత్రం ‘పార్టీని తుంగలో తొక్కండి కానీ నాకు ఓటు వేసి నన్ను గెలిపించండి’ అంటూ ఓటర్లను వేడుకుంటున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్‌ అవుతోంది.

వివరాలు.. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, సిట్టింగ్‌ ఎమ్మెల్యే జీతు పట్వారీ ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఓటర్లతో ‘పార్టీని తుంగలో తొక్కండి.. కానీ నాకు ఓటు వేసి నన్ను గెలిపించండి.. నా ఇజ్జత్‌ కాపాడండి’ అంటూ వేడుకుంటున్నారు. పట్వారీ అభ్యర్థనను కాస్తా సదరు ఓటర్లు వీడియో తీసి ఇంటర్‌నెట్‌లో అప్‌లోడ్‌ చేశారు. దాంతో ప్రతిపక్షాలకు మంచి అవకాశం దొరికినట్లైంది.

ఈ వీడియోను సాకుగా చూపిస్తూ బీజేపీ నాయకులు కాంగ్రెస్‌ పార్టీ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ‘మీ ఎమ్మెల్యేనే పార్టీని తుంగలో తొక్కండి అంటున్నారు దీని గురించి జనాలకు ఏం చెబుతారు అంటూ’ ప్రశ్నిస్తున్నారు. దాంతో కాంగ్రెస్‌ పార్టీ పట్వారీ మీద చర్యలు తీసుకోవడానికి సిద్ధమైనట్లు సమచారం.

Advertisement
Advertisement