‘డేటా చోరీ రెండు రాష్ట్రాల సమస్య కాదు’

GVL Narasimha Rao Slams Chandrababu Naidu Over IT Grids Data Breach - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రజల సమాచారాన్ని ప్రైవేటు సంస్థలకు అందజేసి.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పెద్ద నేరానికి పాల్పడిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు మండిపడ్డారు. ఐటీ గ్రిడ్స్‌ స్కామ్‌పై ఆయన మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ప్రజల సమాచారాన్ని రాజకీయాలకు వాడుకోవడం దుర్మార్గమైన చర్య అని ఆయన అభిప్రాయపడ్డారు. ఓటర్ల ప్రొఫైల్‌ సేకరించి డేటాను దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వ సమాచారం ఎలా వచ్చిందని ప్రశ్నించారు.  ఈ డేటాతో చంద్రబాబు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు యత్నించారని ఆరోపించారు. ఇప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చేసరికి తన బండారం బయటపడుతుందని చంద్రబాబు భయపడుతున్నారని విమర్శించారు.(డేటా స్కామ్‌ డొంక కదులుతోంది!)

డేటా చోరికి పాల్పడి చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని తెలిపారు. ఇది రెండు రాష్ట్రాల సమస్య కాదని.. ప్రజల భద్రత, గోప్యతకు సంబంధించిన విషయమని పేర్నొన్నారు. దీనిపై లోతైన విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి.. లేకుంటే ప్రజస్వామ్యం అపహాస్యం అవుతుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ప్రయోజనాలకు పచ్చ చొక్కాలకే పరిమితం చేస్తున్నారని విమర్శించారు. దుర్మార్గులు రాజకీయాలు చేస్తే ఇలాంటి నేరాలే జరుగుతాయని వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై ఈసీ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. తప్పుచేసిన వారిని పట్టుకుంటే శభాష్‌ అనకుండా ఏపీ ప్రభుత్వం వింత ఆరోపణలు చేస్తుందని.. ఇది దొంగలు భుజాలు తడుముకున్నట్టు ఉందని ఎద్దేవా చేశారు.(డేటా లీక్‌.. సీఎంవో నుంచే?)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top