మేమే కర్ణాటక వస్తాం..అన్నీ తేలుస్తాం | CM BS Yediyurappa Canceled His Delhi Visit | Sakshi
Sakshi News home page

మేమే కర్ణాటక వస్తాం..అన్నీ తేలుస్తాం

Jan 12 2020 8:20 AM | Updated on Jan 12 2020 8:50 AM

CM BS Yediyurappa Canceled His Delhi Visit - Sakshi

మీరేం ఢిల్లీకి రాకండి, మేమే వస్తాం, అప్పుడు మంత్రివర్గ విస్తరణ గురించి మాట్లాడదాం.. అని యడియూరప్పకు బీజేపీ పెద్దలు సూచించినట్లు తెలుస్తోంది. ఈ నెల 17, 18 తేదీల్లో బెంగళూరు రానున్న పార్టీ అధినేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అప్పుడే చర్చిద్దామని స్పష్టంచేసినట్లు సమాచారం. మరోవైపు ఆరుగురు మంత్రులను సాగనంపవచ్చని వినికిడి.  

సాక్షి, బెంగళూరు: ఉప ఎన్నికలు రావడం, ఎలాగో మెజారిటీ స్థానాలు గెలిచినా సీఎం యడియూరప్పకు మనశ్శాంతి లేనట్లు సమాచారం. గెలిచిన కొత్త ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు ఇవ్వడం ఒక పట్టాన తేలడం లేదు.  మంత్రి పదవులు ఆశించే వారి జాబితా పెరిగిపోయింది. ఈక్రమంలో ఎవరికి ఇవ్వాలనే దానిపై పార్టీ పెద్దలు సతమతం అవుతున్నారు. ఇలాంటి తరుణంలో మంత్రుల పనితీరుపై నివేదిక తయారు చేసి ఇవ్వాలని పార్టీ అధిష్టానం ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మంత్రివర్గంలో ఎవరిపై వేటు పడుతుందోనని ఉత్కంఠ రేగుతోంది. గత మూడు నెలల కాలంలో ఆయా శాఖల మంత్రుల పనితీరుపై సమగ్ర నివేదిక తయారు చేయాల్సి ఉంది. దీంతో ఈ నెల 11, 12 తేదీల్లో జరగాల్సిన సీఎం యడియూరప్ప ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు.
  
ఆరుగురు ఇంటికే!  
ప్రస్తుతం ఆరుగురు మంత్రులపై వేటు పడుతోందని ప్రచారం సాగుతోంది. ఇందులో భారీ, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి జగదీశ్‌ శెట్టర్, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కేఎస్‌ ఈశ్వరప్ప, రెవెన్యూ శాఖ మంత్రి ఆర్‌.అశోక్, పశుసంవర్ధక శాఖ మంత్రి ప్రభు చౌహాన్, అబ్కారీ శాఖ మంత్రి హెచ్‌.నగేశ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి శశికళ జొల్లె పేర్లు వినిపిస్తున్నాయి.
 
సీఎం ఢిల్లీ పర్యటన రద్దయినట్లే  
సంక్రాంతి పండుగ పూర్తయిన వెంటనే మంత్రివర్గం విస్తరించాలని భావించారు. ఈమేరకు ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలతో చర్చించి తుది నిర్ణయం ప్రకటిస్తామని సీఎం యడియూరప్ప చెప్పిన సంగతి తెలిసిందే. అయితే శని లేదా ఆదివారం ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా.. పర్యటన రద్దు చేసుకున్నారు. ఫలితంగా పండుగ తర్వాత కూడా కేబినెట్‌ విస్తరణ అనుమానమే అనే సంకేతాలు వెలుగులోకి వచ్చాయి. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈనెల 17, 18 తేదీల్లో బెంగళూరుకు వస్తారని.. ఈక్రమంలో తాను ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్నట్లు సీఎం యడియూరప్ప మీడియాకు తెలిపారు. ఢిల్లీ వెళ్లకుండా బెంగళూరులోనే కేబినెట్‌ విస్తరణపై చర్చిస్తామన్నారు.

చదవండి: వికేంద్రీకరణే మేలు.. ఎలుగెత్తిన గళాలు

Advertisement
 
Advertisement
Advertisement