బీజేపీ నేత కన్నాకు మంత్రి బుగ్గన సవాల్

Buggana Rajendranath Reddy Challenges Kanna Lakshmi Narayana Prove Allegations - Sakshi

సాక్షి, విజయవాడ: కరోనా నిర్ధారణ పరీక్షల కిట్ల కొనుగోలు కంపెనీలో తాను డైరెక్టర్‌ను కాదని ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి స్పష్టం చేశారు. కిట్ల కొనుగోలు అంశంలో బీజేపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ ఆరోపణలపై శుక్రవారం ఆయన స్పందించారు. తాను సదరు కంపెనీలో డైరెక్టర్‌ను అని నిరూపిస్తే రేపు ఉదయం 9 గంటలకే రాజీనామా చేస్తానని సవాల్‌ విసిరారు. కాగా కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దక్షిణ కొరియా నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఒక్కో కిట్‌కు రూ. 730 చొప్పున వెచ్చించి తొలుత లక్ష కిట్లను దిగుమతి చేసుకున్న సర్కారు.. రెండు లక్షల కిట్ల కొనుగోలుకు ఇచ్చిన పర్చేజ్‌ ఆర్డర్‌లో ప్రత్యేకమైన క్లాజ్‌ను పెట్టింది. దేశంలో ఎవరకి తక్కువ ధరకి అమ్మితే అదే ధరను చెల్లిస్తామని షరతు కూడా విధించింది. (కరోనా పరీక్షల్లో దేశంలోనే ఏపీ తొలిస్థానం: బుగ్గన)

ఈ క్రమంలో కన్నా లక్ష్మీ నారాయణ సహా పలువురు టీడీపీ నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే ర్యాపిడ్‌ కిట్ల కొనుగోలు డాక్యుమెంట్లను ప్రభుత్వం విడుదల చేయడంతో వీరి తప్పుడు ప్రచారం బట్టబయలైంది. ఇదిలా ఉండగా.. కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఇప్పటికే దేశంలో ప్రథమ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ మరో ఘనత సొంతం చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు లక్షకుపైగా టెస్టులు నిర్వహించినట్టు ఆంధ్రప్రదేశ్‌ ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top