‘టీడీపీ హయాంలో బ్రాహ్మణులకు ఇబ్బందులు’

Brahmins Are In Trouble During TDP Rule Said By Brahmin Adhyayana commitee Members  - Sakshi

అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి బ్రాహ్మణ అధ్యయ కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. చరిత్రలో తొలిసారిగా బ్రాహ్మణ సమస్యలపై వైఎస్‌ జగన్‌, అధ్యయన కమిటీ వేయడం హర్షణీయమన్నారు. టీడీపీ హయాంలో బ్రాహ్మణులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రాహ్మణుల కోసం రూ.1000 కోట్లతో కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని బాబు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.

తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రాహ్మణులను బాబు ఆదుకోకుండా వేధింపులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ పేరు చెప్పి టీడీపీ కార్యకర్తలకు లోన్‌లు ఇస్తున్నారని వైఎస్సార్‌సీపీ బ్రాహ్మణ అధ్యయన కమిటీ సభ్యులు ఆరోపించారు.

బాబు హయాంలో బీసీలకు అన్యాయం: నరసయ్య గౌడ్‌

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడి హయాంలో బీసీలకు అన్యాయం జరుగుతోందని బీసీ అధ్యయన కమిటీ సభ్యులు నరసయ్యగౌడ్‌ ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు ఆరు పేజీల హామీలిచ్చి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోయలను ఎస్టీల్లో, కాపులను బీసీల్లో చేర్చినట్లు ప్రకటించారే గానీ చట్టబద్ధత కల్పించలేదని వ్యాఖ్యానించారు. బీసీల కోసం రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్‌ చేశారు. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వస్తేనే బీసీలకు సరైన న్యాయం జరుగుతుందని నమ్ముతున్నట్లు నరసయ్య గౌడ్‌ తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top