రాజస్తాన్లో నేడే పోలింగ్
జైపూర్: రాజస్తాన్ అసెంబ్లీలోని 200 స్థానాలకు గాను 199 సీట్లకు నేడు ఎన్నికలు జరగనున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత ఎదుర్కొంటున్న బీజేపీ.. అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్.. ఈ రెండింటిలో గెలుపెవరిదనేది నేటి ఎన్నికతో తేలిపోనుంది. సుమారు 2వేల మంది అభ్యర్థులు బరిలో ఉండగా 51,687 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. 1.44 లక్షల మంది పోలీసు సిబ్బందిని బందోబస్తు కోసం వినియోగిస్తున్నారు.
రాష్ట్రంలోని 130 సీట్లలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ జరగనుంది. ఆల్వార్ జిల్లాలోని రామ్గఢ్ నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థి మృతితో అక్కడ ఎన్నిక ఆగిపోయింది. బీజేపీ నుంచి వసుంధరా రాజే తిరిగి అధికార పగ్గాలు చేపడతామని ధీమాతో ఉండగా కాంగ్రెస్ నుంచి అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడుతున్నారు. ఈ నెల 11న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.