'చెన్నమనేని బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే'
సాక్షి, సిరిసిల్లా : వేములవాడ ఎమ్మెల్యే చెన్నమ్మనేని రమేశ్ పౌరసత్వంపై కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ కీలక వాఖ్యలు చేశారు. రమేశ్ తాను భారతదేశ పౌరున్ని అంటూనే జర్మనీ పాస్పోర్టుపై జర్మనీ ఎలా ప్రయాణం చేస్తున్నాడని శ్రీనివాస్ పేర్కొన్నాడు. జర్మనీ పాస్పోర్టుపై మద్రాస్ నుంచి జర్మనీ వెళ్లే పరిస్థితి ఎందుకు వచ్చిందని, దీనిపై ప్రజలకు వివరణ ఇవ్వాల్పిన అవసరం ఉందని పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ మూడు సార్లు చెన్నమనేని రమేశ్ భారతదేశ పౌరుడు కాదని తేల్చి చెప్పినా గత 11 సంవత్సరాలుగా నియోజకవర్గ ప్రజలను, దేశాన్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. సాక్షాత్తు భారతదేశ న్యాయస్థానం ఈ దేశ పౌరుడు కాదని తేల్చి చెప్పినా దొంగ చాటుగా పౌరసత్వం పొంది వివాదంలో కూరుకుపోయిన వ్యక్తికి టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఎలా ఇచ్చిందని మండిపడ్డారు. ఇప్పటికే కోర్టు పలుమార్లు మొట్టికాయలు వేసినా ఆయనకు బుద్ధి రాలేదని , వెంటనే నియోజకవర్గ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు.