స్వయంగా చేసి చూసినది | spirituality | Sakshi
Sakshi News home page

స్వయంగా చేసి చూసినది

Nov 20 2014 1:19 AM | Updated on Sep 2 2017 4:45 PM

ఆధ్యాత్మిక మార్గంలో కాలిడిన వారికి తామేస్థాయికి చేరామో కొలిచి చూసుకోవాలని అనిపించడం సహజమైన బలహీనత.

ఆధ్యాత్మిక మార్గంలో కాలిడిన వారికి తామేస్థాయికి చేరామో కొలిచి చూసుకోవాలని అనిపించడం సహజమైన బలహీనత. కానీ ఈ స్థాయి కొలవగలిగింది కాదేమోననే అనుమానం రాదు. ఎవరో గురువు ఏదో చెప్పాడని కొందరు సంప్రదాయబద్ధంగా ఏదో జపమో, పారాయణో మొదలుపెడతారు. ఇది చేసిన తర్వాత కూడా తాను మొదట్లో ఎక్కడ ఉన్నాడో, ఇప్పటికీ అక్కడే ఉన్నాననే సందేహం కలుగుతుంది. ‘ప్రగతేమీ కానరాదే’ అని గురువుతో అంటే, ‘మరింత విశ్వాసంతో చేయాలి’ అంటారు ఆయన. అదే దిక్కని అలాగే నడుస్తుంటారు. ఇది దారి కాదేమో అని ఎవ రైనా అన్నా వినడు. దిశ మారదు. దశ తిరగదు.
 ఒకసారి కొందరు మతానుయాయులు కొండలెక్కుతున్నారు. కొన్ని గంటలయింతర్వాత వారికి దారి తెలియకుండా పోయింది. ఏ కొండ మీద ఉన్నామో, ఎటు వెళుతున్నామో అంతుబట్టలేదు. వారిలో ఒకరు ఆ కొండలకు చెందిన చిత్రపటం తీసి దానిని అటూ ఇటూ తిప్పి అధ్యయనం చేసి చూశాడు. కొన్ని కొండగుర్తులూ, తన దిక్సూచి ఎటు చూపిస్తున్నదీ, సూర్యుడెక్కడ ఉన్నదీ గమనించి చివరకు ‘‘పటంలో అదుగో ఆ పెద్ద కొండ కనిపిస్తున్నదే, అది చూశారా?’’ అని అడిగాడు.
 ‘‘చూశాం!’’ అన్నారు మిగతావారు, కళ్లన్నీ ఆ పటం మీద పెట్టి.
 ‘‘అయితే ఈ చిత్రపటాన్ననుసరించి దానిలో కనిపించే పెద్దకొండ మీద మనమున్నాం’’ అన్నాడు. చిత్రపటాల్లో పొరపాటున్నా మనం నమ్మేది వాటినే. ఆధ్యాత్మికంగా మనమెంత ఎదిగామో మన గురువులు మనకు సర్టిఫికెట్లు ఇవ్వవలసిన స్థితికి వచ్చాం.
 జీవిత ఆరంభంలో మనం అందర్నీ నమ్మేస్తుంటాం. తల్లిదండ్రులు, మన పెద్దలు, అన్నీ సరిగ్గా చేస్తారనే నమ్మకముంటుంది. తర్వాత్తర్వాత  వారి బలహీనతలు పొరపాట్లు వారికుంటాయని, వారిని గుడ్డిగా అనుసరించడం సరికాదనీ తెలుస్తుంది. ఎవర్నీ నమ్మరాదనే విపరీత పరిస్థితికి చేరుకోవడం కొన్ని సందర్భాలలో జరగవచ్చు. కానీ కొంత కాలానికి అసలు ఎవర్నీ నమ్మరాదనే సిద్ధాంతమూ సరైనది కాదని అర్థమవుతుంది. మెల్లిమెల్లిగా నమ్మతగినవారు కొందరుంటారనీ నమ్మతగని వారు చాలామంది ఉంటారనీ స్వానుభవంలో తెలియ నారంభిస్తుంది.
 ఏ గురువు ఏది చెప్పినా శ్రుతజ్ఞానం అందిస్తున్నాడా, లేక జీవితం నుండి ప్రత్యక్షంగా స్వానుభవంతో నేర్చుకున్నది మనతో పంచుకుంటున్నాడా అనేది చూడాలి. నేరుగా జీవితం నుండి నేర్చుకున్నదై ఉంటే అతడు మనతో పంచుకున్నది మనమూ ప్రయత్నించి సాధించవచ్చు. అతడు చెప్పినదానికి ఆరంభంలోనే అవుననక్కరలేదు. కాదనక్కరలేదు. చేసి చూడడంలో వచ్చే నష్టమేమీ లేదు. అలా చేసినప్పుడు విషయాన్ని మనకు మనమే తెలుసుకుంటాం; తెలుసుకున్నది మన సొంతమవుతుంది. మనమే మరొకరితో పంచుకోగలిగి ఉంటాం. అతడు చెప్పాడు కాబట్టి నమ్మడమనే ప్రశ్న ఉదయించదు. అలా ఒకటి రెండు విషయాల్లో చేసి చూసి ఆ అనుభవం మనం పొందినప్పుడు అతడు చెప్పింది ఏదైనా అది ఆప్తవాక్యమేనని గ్రహించి, ప్రతీది స్వయంగా చేసి చూడనారంభిస్తాం. చేసిన వాటితో మనకు సత్యం కనిపించింది కాబట్టి ఇతర విధాల చెప్పినవి కూడా ఆచరిస్తూ ఉంటాం. ఇలా ఏర్పడిన విశ్వాసం వేరు. ఈ విశ్వాసానికి తిరుగులేదు. ఇది స్వానుభవం మీద ఏర్పడినటువంటిది.
 ‘పురుషులందు పుణ్య పురుషులు వేరయా’ అన్నాడు వేమన. నిజమైన దార్శనికులను ఆశ్రయించినవాడు తరిస్తాడు. తానెంతవరకు ఎదిగానని కొలిచి చూసుకోవలసిన అగత్యముండదు. తాను అనంతంగా ముందుకు సాగిపోతున్నానని గ్రహిస్తాడు.
 నీలంరాజు లక్ష్మీప్రసాద్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement