ఇండియాకు గ్రీస్ పాఠాలు | Greece lessons to india | Sakshi
Sakshi News home page

ఇండియాకు గ్రీస్ పాఠాలు

Jul 7 2015 12:55 AM | Updated on Sep 3 2017 5:01 AM

ఇండియాకు గ్రీస్ పాఠాలు

ఇండియాకు గ్రీస్ పాఠాలు

పాలనా వ్యవస్థకు రాజకీయవేత్తలకన్నా ‘టెక్నోక్రాట్స్‌‘ (కేవల సాంకేతిక నిపుణులు) మాత్రమే నాయక స్థానాల్లో ఉండాలని రచయిత నైస్‌బిత్ సూచించాడు!

పాలనా వ్యవస్థకు రాజకీయవేత్తలకన్నా ‘టెక్నోక్రాట్స్‌‘ (కేవల సాంకేతిక నిపుణులు) మాత్రమే నాయక స్థానాల్లో ఉండాలని రచయిత నైస్‌బిత్ సూచించాడు! దేశంలో ప్రణాళికా సంఘాన్ని చాప చుట్టి, ‘నీతి-ఆయోగ్’ అనే దిశాదశా లేని సంస్థను ఏర్పాటు చేయటం బహుశా ఆ ఆలోచనల్లో భాగమే. 1980కి ముందు, తరవాత పలుమార్లు రూపాయి పతనం కావడానికి ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ సంస్కరణలే (1991) కారణమన్నది బహిరంగ రహస్యం!
 
 ‘స్వతంత్ర దేశాలను రుణాలతో బంధించే శక్తిమంతమైన అంతర్జాతీయ సంస్థలు ప్రపంచ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంక్. నిరంకుశా ధికార వర్గానికి ప్రాతినిధ్య సంస్థలు. వీటిలో ప్రధాన వాటాదారులు- అమె రికా, బ్రిటన్, జపాన్ వంటి సంపన్నదేశాల ప్రభుత్వాలు. ఇవి పెట్టుబడిదారీ వ్యవస్థకు లోబడి పనిచేసే ద్రవ్య నియంత్రణ సంస్థలు. బలవంతుల ఆర్థిక, ద్రవ్య ప్రయోజనాలకు అనుగుణంగా స్పందిస్తూ ఉంటాయి. ఇవి, మార్కెట్ శక్తులను/ మార్కెట్లను తారుమారు చేయడం ద్వారా దేశాల జాతీయార్థిక వ్యవస్థలను శాసిస్తూ వాటిపైన పెత్తనం చలాయిస్తూ ఉంటాయి. ఇదే అసలు ప్రమాదం.’    
 - ప్రొఫెసర్ మైఖేల్ చౌసుదోవస్కీ
 
 (‘నూతన ఆర్థిక సంస్కరణలు-ప్రపంచవ్యాప్త దారిద్య్రీకరణ’, 1997, నుంచి) ఈ ఆచార్యుడి అంచనా ఎంత వాస్తవికమైనదో 1980లలో 100 దేశా లలో ప్రవేశ పెట్టించడంతో ప్రారంభమైన ప్రపంచ రుణ సంస్థల ప్రజా వ్యతి రేక ‘సంస్కరణల’ ఫలితాలు వాటిని అనుభవించిన దేశాలకే తెలుసు. ప్రపం చ డాలర్ సామ్రాజ్యానికి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చిన ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్‌లకు పోటీగా అవతరించిన యూరోపియన్ యూనియన్ ‘యూరో’ కరెన్సీ వ్యవస్థలో సభ్యురాలైన గ్రీస్ దేశప్రజలు నేడు పడుతున్న కటిక ఆర్థిక బాధలు కూడా అలాంటి ఫలితాలకు తాజా నిదర్శనాలే. మరోమాటలో చెప్పాలంటే రెండురకాల దోపిడీ వ్యవస్థల మధ్య చిక్కుకున్న యూరప్ దేశా లలో స్పెయిన్, ఇటలీలతో పాటు గ్రీస్; ఆఫ్రికా ఖండంలో ఒకనాటి ధాన్యా గారాలైన ఇథియోపియా, మొరాకో వంటి మరికొన్ని  దేశాలూ ఉన్నాయి. కానీ ఈ దేశాలన్నింటినీ మించి రుణాల తీర్మానం విషయంలో గ్రీస్ మీదనే ప్రపంచీకరణ సంస్థలు ఎందుకు ఎక్కువ దృష్టి పెట్టాయి?
 
 
 గ్రీస్ మీద ద్రవ్య నిధి సంస్థల గుర్రు?
 2008 నుంచి 2014 దాకా అంతర్జాతీయ రుణ సంస్థల చెప్పుచేతలలో ఉన్న పాలకవర్గాల హయాంలోనే గ్రీస్ రుణబాధలు మొదలైనాయి. ఇటీవల (ఆరు మాసాల నాడు) అక్కడి పార్లమెంటుకు జరిగిన ఎన్నికలలో వామపక్ష అభ్యర్థి అలెగ్జీ సిప్రాస్ గెలుపొంది ప్రధాని కావడంతో ప్రపంచ రుణ సంస్థలలో గుర్రు మొదలైంది. గ్రీస్‌ను ఆర్థిక పరాధీన స్థితి నుంచి విముక్తం చేసేందుకు వామ పక్ష ప్రభుత్వం సిప్రాస్ నాయకత్వంలో స్వతంత్ర పంథాలో ముందుకు కొన సాగింది. ఇక్కట్లలో ఉన్న సామాన్య ప్రజానీకాన్ని రక్షించేందుకు నిర్దిష్టమైన కొన్ని సంక్షేమ పథకాలకు అంకురార్పణ చేసింది. ప్రకటించిన సంక్షేమ పథ కాలు పెన్షనర్లకు, పేద రైతులకు, కార్మిక వర్గానికి అనుకూలమైనవి కావడం తో ఇప్పటికిప్పుడు పాత రుణాలు తీరుస్తావా చస్తావా అని పెట్టుబడి రుణ సంస్థలు పట్టుపట్టాయి. కానీ సిప్రాస్ ప్రభుత్వం, ‘వెనుతిరిగేది లేదనీ, రుణా లను రీషెడ్యూల్ చేసుకోవాలనీ’ ఎదురు ఆదేశించింది. ప్రభుత్వ ప్రతిపాద నల మీద నేరుగా ప్రజాభిప్రాయ సేకరణ (రిఫరెండం) జరిపిస్తామని ప్రక టించి ముందుకు వెళ్లింది.
 
 జూలై 5వ తేదీన గ్రీస్ ప్రజలకు సిప్రాస్ ప్రకటిం చిన ‘సంక్షేమ పథకాలను ఉపసంహరించుకుని రుణాలు చుప్తాగా చెల్లించా ల’న్న రుణ సంస్థలకు 60.4 శాతం ఓటుతో ప్రజలు చెంపదెబ్బ కొట్టారు. నిజానికి  చెల్లించవలసిన రుణాలలో 1.7 బిలియన్ డాలర్ల బ కాయిలను గ్రీస్ ముందే తీర్చింది. గ్రీస్‌లో అధికారంలో ఉన్నది వామపక్షమైనందున ‘మిగ తాది కూడా ఇప్పటికిప్పుడే చెల్లించాలని ఐఎంఎఫ్ పట్టుపట్టింది’. జర్మనీ కను సన్నలలో మెలగుతున్న యూరోపియన్ యూనియన్ నుంచి గ్రీస్ జారి పోయి, యూరోపియన్ సమాఖ్యకు ఎక్కడ ఎసరు పెడుతుందోనన్న జంకు ఉంది. ఇలాంటి బెదురు జర్మన్ లిబరల్ అవకాశవాద అధినేత మెర్కెల్‌కు కూడా లేకపోలేదు. అయినా, యూరోపియన్ ఆర్థిక సంస్థ, ఇతర సంస్థలు గ్రీస్ ప్రభుత్వాన్ని అదిరింపులకూ బెదిరింపులకూ గురిచేస్తూనే వచ్చాయి.
 
 అయినా ‘ప్రజాభిప్రాయ సేకరణ’ యూరప్ సమాఖ్యకూ, యూరో కరెన్సీ వ్యవస్థకూ వ్యతిరేకంగా చేపట్టినది కాదని సిప్రాస్ హుందాగా వివరణ ఇచ్చాడు. అలాంటి ప్రజాభిప్రాయం ద్వారా సంప్రదింపులకు సానుకూలమైన వాతావరణాన్ని తిరిగి సృష్టించడమే తన లక్ష్యమని చెప్పాడు. కానీ భవిష్యత్తు అంధకారబంధురమేనని పెన్షనర్లనూ, నిరుద్యోగ యువతనూ, కార్మిక వర్గాన్నీ రుణదాతలు భయపెట్టారు. దీనికి విరుగుడుగా ‘పొదుపు పేరుతో దేశ  ప్రజాబాహుళ్యాన్ని మాడ్చలేననీ, కనీస సంక్షేమ పథకాలు అమలు చేయ క తప్పదనీ’ సిప్రాస్  కీలెరిగి వాత పెట్టాడు. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా పాలనావ్యవస్థకు స్థిరత్వం కలిగించే యత్నంలో ఘనమైన మెజారిటీని సాధిం చి, ‘ఇదిగో ప్రజాతీర్పు. ఇప్పుడు రుణాల రీషెడ్యూల్‌కు, సవ్యమైన ప్రతిపాద నలతో ముందుకు రావొచ్చు!’ అని రుణదాతలకు సిప్రాస్ సవాలు విసిరాడు. ఒక వర్గం మీడియా కూడా బెదిరింపుల ద్వారా సిప్రాస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో భాగస్వామి అయింది. ఇది పచ్చి నిజం! అందుకే గ్రీస్ పాలక పక్షం ‘సిరిజా’ తరఫున లండన్‌లో సాధికార ప్రతినిధిగా ఉన్న ప్రసిద్ధ మహిళ మెరానీ ప్రింటాలిస్, ‘గత ఐదు రోజులుగా గ్రీస్‌పై జరిగిన దాడి ఒక విధంగా ప్రభుత్వంపై తిరుగుబాటును ప్రోత్సహించడమే. గ్రీస్‌పైన నియంతృత్వాన్ని రుద్దబోవడమే. ఏ రూపంలోనూ ద్రవ్య సహాయం అందకుండా చేయడమే. ప్రజల్ని భీతావహుల్ని చేయడమే’ (హిందూ: 6 జూలై, 2015) అని ప్రకటిం చారు. నిజానికి, ఆంగ్లో-అమెరికన్ సామ్రాజ్య పెట్టుబడుల ఏలుబడిలో ఉన్న ప్రపంచ రుణ సంస్థలు 100కి పైగా దేశాల్లో 1980ల నుంచీ అనుసరిస్తున్న రుణ విధానాలూ, ఒత్తిళ్లూ, స్థానిక ప్రభుత్వాలను కూల్చుతూ వచ్చిన పద్ధ తులే ఇవని మరచిపోరాదు.
 
 రుణ భారత్‌కు అనుభవం కావాలి?
 గ్రీస్ తాజా అనుభవంతోనైనా లక్షల కోట్ల రూపాయల రుణాల ఊబిలో ఈదులాడుతున్న భారత ప్రభుత్వాలూ, పెట్టుబడిదారీ వర్గాలకు దాదాపు ప్రత్యక్ష ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకపక్షాలూ గుణపాఠాలు నేర్వాలి. పెట్టు బడిదారీ సంస్థలకు చెందిన రచయితల్లో ఒకరైన నైస్‌బిత్ పాలనా వ్యవస్థకు రాజకీయవేత్తలకన్నా ‘టెక్నోక్రాట్స్‌‘ (కేవల సాంకేతిక నిపుణులు) మాత్రమే నాయక స్థానాల్లో ఉండాలని సూచించాడు!
 
 దేశంలో ప్రణాళికా సంఘాన్ని చాప చుట్టి, ‘నీతి-ఆయోగ్’ అనే దిశాదశా లేని సంస్థను ఏర్పాటు చేయటం బహుశా ఆ ఆలోచనల్లో భాగమే. 1980కి ముందు, తరవాత పలుమార్లు రూపాయి పతనం కావడానికి ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ సంస్కరణలే (1991) కారణ మన్నది బహిరంగ రహస్యం! ఈ సంస్థల నుంచి దేశానికి రూ.23 వేల కోట్లతో ప్రారంభమైన రుణభారం నేటికి రూ.12 లక్షల కోట్లకు పెరిగినట్టు అంచనా!  అమెరికాలో ప్రారంభమైన ఆర్థిక సంక్షోభం ‘మాంద్యం’ దశను దాటి 1930ల నాటి ప్రపపంచ ఆర్థిక సంక్షోభదిశగా మరోసారి ప్రయాణిస్తోం దని అందువల్ల భారత ప్రభుత్వ విధానాలు, ఆచరణా అందుకు ప్రతికూ లంగా ఉండి, ద్రవ్యోల్బణాన్ని, వడ్డీ రేట్లను నియంత్రించుకోవాలని కొలది రోజుల నాడు రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ చేసిన హెచ్చరి కను పాలకపక్ష నేతలు ఎగతాళి చేయడానికి ప్రయత్నించారు. రాజన్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చేసిన ప్రసంగాన్ని సవరించడానికి విశ్వ ప్రయ త్నం జరిగింది. రాజన్ హెచ్చరికల ప్రాధాన్యాన్ని గ్రీస్ అనుభవం తరువాత బాధ్యతగల భారత ఆర్థికవేత్తలూ, నిపుణులూ గుర్తించి ధ్రువపరుస్తూండటం గమనించదగిన పరిణామం.
 
సామ్రాజ్య పూరిత యాత్ర కొనసాగింపు
 ఇండియాలో (గ్రీస్‌లో కూడా) ప్రస్తుతం ప్రపంచ రుణ సంస్థల లక్ష్యం - క్రమంగా టెక్నోక్రాట్స్ కనుసన్నల్లో ‘స్మార్ట్ ఫోన్లు’ ‘స్మార్ట్ టవున్స్’ స్మార్ట్ బిల్డింగుల పేరిట అంతటినీ ‘స్మార్ట్’ బాటలో నడిపించడమే. దేశంలోని పబ్లిక్ రంగ బ్యాంకుల్ని క్రమంగా పూర్తిగా ప్రైవేటీకరించేందుకు, స్వదేశ, విదేశ గుత్త సంస్థలకు (ఎంఎన్‌సీ) దేశ ఆర్థిక వ్యవస్థను శాసించే అధికారాలు దఖలు పరి చేందుకు ఒక నమూనా సిద్ధమైనట్టు నిపుణుల అభిప్రాయం. జాతీయ స్థాయిలో ప్రధాన ఆర్థిక సలహాదారుగా పదవీ బాధ్యతలు స్వీకరించడానికి కొద్ది రోజుల ముందే అరవింద సుబ్రహ్మణ్యం ఈ నమూనాను ప్రతిపాదిం చినట్టు కొందరు భావిస్తున్నారు!

ఆ ‘నమూనా’- ‘మేక్ ఇన్ ఇండియా’ కాదు కదా? ఇక్కడే, వలస వ్యవస్థలకు బాటలు పడినప్పుడు మొదలైన సామ్రాజ్య కాంక్షా పూరిత యాత్రలు ఇంకా ఎలా కొనసాగుతున్నాయో ప్రొఫెసర్ నోమ్ చామ్‌స్కీ చెప్పిన  మాటలు గుర్తు చేసుకుందాం: ‘ప్రపంచ రుణసంస్థలు పెట్టు బడుల వ్యాప్తి కోసం తలపెట్టిన సంస్కరణలు సంపన్న పెట్టుబడిదారీ దేశాల సరుకులను బడుగు వర్ధమాన దేశాల మార్కెట్లపైన రుద్దడానికి ఉద్దేశించినవే. ఫలితం- వేతనాలు, జీవన ప్రమాణాలు, సంక్షేమ పథకాలు దారుణంగా పడి పోవడం. ఈ పరిణామం వంద దేశాలలో పేదలకు పిడుగుపాటైంది.’ గ్రీస్‌లో జరిగింది ఇదే. నేడు మన దేశంలో జరుగుతున్నదీ, ప్రభావిత దేశాలలో భవిష్యత్తులో జరగబోయేదీ అదే.  
 (వ్యాసకర్త మొబైల్: 9848318414)
 - ఏబీకే ప్రసాద్
 సీనియర్ సంపాదకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement