మెక్సికోలో వైస్ ఛాన్సలర్ల సదస్సు
మెక్సికో: మెక్సికోలో నవంబర్ 30 నుంచి డిసెంబర్ 2 వరకు వైస్ ఛాన్సలర్ల సదస్సు జరిగింది. ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీ(ఇఫ్లూ) వైస్ ఛాన్సలర్ సురేష్ కుమార్ ఈ సదస్సుకు ప్రాతినిథ్యం వహించారు. భారత విశ్వవిద్యాలయాల సంఘం (ఎఐయు), నేషనల్ అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీస్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ మెక్సికో (ANUIES)ఈ సమావేశాలను సంయుక్తం గా నిర్వహించాయి.
ఆవిష్కరణలపై అనుభవాలను పంచుకోవడం, ఈ సదస్సులో పాల్గొంటున్న దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం, ఆలోచనలు విస్తరించడానికి వైస్ ఛాన్సలర్ల ప్రత్యేక బృందానికి ఒక సాధారణ వేదికను అందించడమే ఈ సమావేశ ముఖ్య లక్ష్యం. రెండు దేశాల విశ్వవిద్యాలయాల మధ్య అంతర్జాతీయ విద్యా సహకారాన్ని సులభతరం చేయడమే ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా, ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ విశ్వవిద్యాలయం మెక్సికోలోని అటానమస్ యూనివర్శిటీ ఆఫ్ సినాలోవాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా విశ్వవిద్యాలయాలు విద్యా, పరిశోధన, విద్యార్థి, అధ్యాపకుల మార్పిడి కార్యక్రమాలలో సహకరిస్తాయి. అవగాహన ఒప్పందం, జాతీయ మరియు అంతర్జాతీయ ప్రసంగాలు, సమావేశాలు, ప్రత్యేక ప్రదర్శనలు, ఉమ్మడి పరిశోధన ప్రాజెక్టుల నిర్వహణకు వీలు కల్పిస్తుంది.
తన పర్యటనలో భాగంగా ప్రొఫెసర్ సురేష్ కుమార్ శాన్ జోస్ లోని శాన్ జోస్ స్టేట్ యూనివర్శిటీని సందర్శించారు. బోధన, విద్యా పరిశోధనలలో కొత్త పోకడలను అన్వేషించడానికి యునైటెడ్ స్టేట్స్లోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ప్రొఫెసర్ కుమార్ మాట్లాడుతూ.. విద్యావేత్తల నాణ్యతను మెరుగు పరచడానికి, విశ్వవిద్యాలయ విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎక్కువ అవకాశాలను కల్పించడానికి ప్రపంచ భాగస్వామ్యాల అవసరం ఉందన్నారు.