కుటుంబ పోషణకు వెళ్లి కువైట్‌లో మృత్యువాత

Chittoor Woman Died in Kuwait Road Accident - Sakshi

రోడ్డు ప్రమాదంలో రామసముద్రం మహిళ మృతి

రెండు రోజుల్లో రానున్న మృతదేహం

చిత్తూరు, రామసముద్రం : మంచం పట్టిన భర్తకు వైద్యం, కుటుంబ పోషణ నిమిత్తం కడుపు చేత పట్టుకుని కువైట్‌కు వెళ్లిన మహిళ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషాద సంఘటన వివరాలు..

రామసముద్రం మండలం అరికెల గ్రామానికి చెందిన గోవిందమ్మ(42) తన కుమార్తెకు వివాహం చేశారు. కుమారుడు వెల్డింగ్‌ పనులకు వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో గోవిందమ్మ భర్త శ్రీనివాసుల ఆచారి  అనారోగ్యానికి గురై మంచాన పడ్డాడు. ఈ పరిస్థితులలో కుటుంబ పోషణ నిమిత్తం గోవిందమ్మ 2014లో కువైట్‌కు వెళ్లింది. అక్కడ ఒక ఇంట పనులకు కుదిరింది. తిరిగి 2016లో డిసెంబర్‌లో స్వగ్రామానికి వచ్చింది. కొన్ని నెలల విరామం తరువాత 2017లో మళ్లీ కువైట్‌కు వెళ్లింది. 

ఈనెల 5న పనులు ముగించుకుని వెళ్తుండగా వాహనం ఢీకొని రోడ్డు ప్రమాదంలో అక్కడిక్కడే మృతి చెందింది. ఈ విషయాన్ని గోవిందమ్మ స్నేహితులు కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతురాలి కుమారుడు పృథ్వి తన తల్లి మృతదేహం స్వగ్రామానికి చేరేందుకు సహకరించాలని ఈనెల 11న చిత్తూరుకు వెళ్లి జిల్లా కలెక్టర్‌ ప్రద్యుమ్నను కోరారు. స్పందించిన ఆయన ఇండియన్‌ ఎంబసీ అధికారులకు సమాచారం అందించి, కువైట్‌ అధికారులతో మాట్లాడారు. రెండు రోజుల్లో మృతదేహాన్ని తరలించనున్నట్లు వారు చెప్పినట్లు తెలియవచ్చింది. మృతదేహం కోసం కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఎదురుచూస్తున్నారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top