
సాక్షి, హర్యానా : హర్యానాలోని జింద్ ప్రాంతానికి చెందిన అగర్వాల్ కుటుంబాల మహిళల డ్యాన్స్లపై నిషేధం విధించాలని నిర్ణయించారు. పెళ్లిళ్ల సమయంలో వారు విచ్చల విడిగా నృత్యాలు చేస్తున్నారని, అవి అసభ్యకరంగా ఉంటున్నాయని, అందుకే ఇక నుంచి తెరల వెనుకే వారు వేడుకలు జరుపుకోవాలని తాము సూచిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు అఖిల భారతీయ అగర్వాల్ సమాజ్ విభాగం నిర్ణయం తీసుకుంది. పెళ్లిళ్ల సమయాల్లో బరాత్ పేరుతో తమ కుటుంబాలకు చెందిన మహిళలు అందరి ముందు డ్యాన్స్లు వేస్తున్నారని, అది అసభ్యంగా ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొంది.
ఈ సందర్భంగా జిల్లా బీజేపీ మహిళా విభాగం అధ్యక్షురాలు పుష్పా తయాల్ మీడియాతో మాట్లాడుతూ 'పెళ్లి వేడుకల్లో మహిళలు కూడా పాల్గొనాలని అగర్వాల్ కమ్యూనిటీ నిర్ణయం తీసుకుంది. కాకపోతే అందరిముందు కాకుండా మూసి ఉంచిన తెరల వెనుక. అలాగే, పెళ్లిళ్ల సమయాల్లో నగదు రూపంలోమ బహుమతులు వారే తీసుకోకుండా సేవా భారతీకి అప్పగించి పేదవారికి సహాయం చేసేందుకు ఉపయోగించాలి అని కూడా నిర్ణయించారు. దీంతో డీజేవంటి వాటిపై చేసే వృధా వ్యయాన్ని నిలువరించవచ్చు' అని కూడా ఆమె చెప్పారు.