'రష్యన్ కోణంలో దర్యాప్తు జరపాల్సిందే' | Website releases ‘proof’ claiming Bose died in air crash, but Mamta wants ‘Russian angle’ probed | Sakshi
Sakshi News home page

'రష్యన్ కోణంలో దర్యాప్తు జరపాల్సిందే'

Jan 16 2016 4:52 PM | Updated on Sep 28 2018 3:41 PM

'రష్యన్ కోణంలో దర్యాప్తు జరపాల్సిందే' - Sakshi

'రష్యన్ కోణంలో దర్యాప్తు జరపాల్సిందే'

నేతాజీ ప్రమాదంలో చనిపోయి ఉంటే... స్వాతంత్ర్యం తర్వాత ఆయన కుటుంబం రహస్యంగా ఎందుకు బతకాల్సి వచ్చిందని మమతా బెనర్జీ ప్రశ్నించారు.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో చనిపోయినట్లు తాను నమ్మడం లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అంటున్నారు. నిజం నిర్ధారించలేకపోవడం మన దేశానికే సిగ్గు చేటని, ఆయన గురించి రష్యన్ కోణంలో దర్యాప్తు చేపట్టాలని కోల్ కతాలో జరిగిన నేతాజీ 75వ వార్షికోత్సవ సందర్భంలో ఆమె డిమాండ్ చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మహాత్మాగాంధీ జాతి పిత అయితే, స్వాతంత్ర్యం రాకముందు నేతాజీ జాతి నేత అని ఆమె అన్నారు. నేతాజీ ప్రమాదంలో చనిపోయి ఉంటే... స్వాతంత్ర్యం తర్వాత ఆయన కుటుంబం రహస్యంగా ఎందుకు బతకాల్సి వచ్చిందని ప్రశ్నించారు. దీనికి సమాధానం కావాలంటే రష్యన్ కోణంలో దర్యాప్తు జరగాల్సిందేనని ఆమె డిమాండ్ చేస్తున్నారు.

అయితే తాజాగా నేతాజీ మనవడు ఆశిష్ రే నిర్వహిస్తున్న బ్రిటిష్ కు చెందిన వెబ్ సైట్ www.bosefiles.info అదే విషయంపై అధ్యయనాలు నిర్వహించి, నివేదికలను వెల్లడించింది. ఏళ్లకాలంగా ఉన్న అనుమానాలు నివృత్తి చేసేందుకు నేతాజీ చివరి రోజుల్లోని వివరాలు, ప్రత్యక్ష సాక్ష్యాలను సేకరించి వెబ్ సైట్ లో పొందుపరిచింది. నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోయినట్లు ఆ వెబ్ సైట్లోని నాలుగు నివేదికలూ నిర్ధారిస్తున్నాయి. ఆగస్టు 18, 1945లో తైపీ దగ్గర జరిగిన విమాన ప్రమాదం తర్వాత సుభాష్ చంద్రబోస్ మరణించారని, అయితే వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ విషయాన్ని నమ్మడం లేదని, రష్యన్ కోణంలో దర్యాప్తును కోరుకుంటున్నారని రే అంటున్నారు. విమాన ప్రమాదం ఎలా జరిగింది? బోస్ ప్రమాదం నుంచి బయట పడ్డారా లేదా అన్న వివరాలపై ఆయన అనుచరుడు కల్నల్ హాబిబర్ రెహ్మాన్ చెప్పిన విశేషాలు సహా మరిన్ని వివరాలను ఆశిష్ రే... తాజాగా వెబ్ సైట్లో పోస్ట్ చేశారు.

బోస్ అనుచరుడు చెప్పిన ప్రకారం ఎయిర్ క్రాష్ నుంచి బోస్ తో పాటు రెహ్మాన్ కూడా బయట పడ్డారని,  ఆరోజు  ఫిన్నే, డేవిస్... అనే ఇద్దరు పోలీసు అధికారుల నేతృత్వంలో ఇండియానుంచి దర్యాప్తు కోసం హెచ్ కె రాయ్, కెపి డే నిఘాజట్లు సైగాన్, తైపీలలో దర్యాప్తు చేపట్టడం కోసం బ్యాంకాక్ కు వెళ్ళారని,  జపనీస్ అధికారిక డాక్టర్ ట్సురుతాను విచారించామని రే చెప్తున్నారు.  బోస్ చనిపోయే ముందు నర్స్ ట్సాన్ పై షా చికిత్స అందించారని,  డాక్టర్ యోష్మి ని రే స్వయంగా కలిశానని కూడ అంటున్నారు. విమాన ప్రమాదం తర్వాత బోస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు ఈ వివరాలన్నీ నిర్ధారిస్తున్నాయని రే స్పష్టం చేస్తున్నారు.

నోనోమియా అనే లెఫ్టినెంట్... సుభాష్ చంద్రబోస్ ఓ ప్రత్యేకమైన, ప్రముఖమైన వ్యక్తి అని చెప్పారని, అందుకే ఆయన్ను ఎలాగైనా బతికించాలని ప్రయత్నించామని డాక్టర్ యోష్మి అన్నట్లు కూడా రే వెల్లడించారు. అయితే బోస్ పరిస్థితి విషమంగా మారుతున్న సమయంలో ఆయన్ను ఎలా ఉంది అని అడిగితే... తలలో తీవ్ర రక్తప్రసరణ జరుగుతున్నట్లనిపిస్తోందన్నారని,  ఓ ఇంజెక్షన్ ఇచ్చిన కాసేపటికే ఆయన ప్రాణంపోయిందని డాక్టర్ రేష్మి వివరించినట్లు 'రే' చెప్తున్నారు. మమతా బెనర్జీకి ఈ విషయాలపై నమ్మకం కుదరడం లేదని అందుకే ఆమె రష్యన్ కోణంలో దర్యాప్తునకు డిమాండ్ చేస్తున్నారని ఆశిష్ రే అంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement