అడిగింది రూ.3 వేల కోట్లు.. ఇచ్చింది రూ.791 కోట్లు | Sakshi
Sakshi News home page

అడిగింది రూ.3 వేల కోట్లు.. ఇచ్చింది రూ.791 కోట్లు

Published Fri, Jan 15 2016 3:25 AM

telangana requests 3 thousend crores Centre sanctions Rs.791 crore drought relief

కేంద్రం కరువు సాయం నాలుగోవంతే
     రాష్ట్ర సర్కారు ఆశలు ఆవిరి
     రైతుల ఇన్‌పుట్ సబ్సిడీకి కూడా సరిపోని నిధులు
     కరువు మండలాల్లో నిధులకు కటకట తప్పదంటున్న అధికారులు


 సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రూ.791 కోట్ల కరువు సాయం ప్రకటించింది. కనీసం వెయ్యి కోట్ల సాయం అందుతుందని అంచనా వేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆశలు అడియాసలయ్యాయి. రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొనేందుకు రూ.3,002 కోట్ల సాయం అందించాలని ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించింది. ఈ ప్రతిపాదనలతో పోలిస్తే నాలుగో వంతే సాయం అందటం సర్కారుకు నిరాశను మిగిల్చింది. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంత భారీ మొత్తంలో సాయం ఎప్పుడూ అందించలేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్  ప్రకటించారు.

గత వారం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు కరువు సాయం కింద రూ.433 కోట్లు మంజూరు చేసింది. దీంతో పోలిస్తే తెలంగాణకు సాయం ఎక్కువే అందినప్పటికీ... కేంద్రం ఇచ్చిన నిధులు పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీకి కూడా సరిపోవని అధికారులు చెబుతున్నారు. దీంతో కరువు మండలాల్లో తాగునీరు, పశుగ్రాసం, ఉపాధి హామీ తదితర కార్యక్రమాలకు నిధుల కటకట తప్పదంటున్నారు.

 కరువు చర్యలపై ప్రభావం
 ఖరీఫ్ సీజన్‌లో తీవ్ర వర్షాభావంతో రాష్ట్రవ్యాప్తంగా పంటలు దెబ్బతిన్నాయి. పెట్టుబడులు మట్టి కలవడంతో రైతులు అపార నష్టాన్ని చవిచూశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 231 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది. తగినంత సాయం అందించాలని కేంద్రాన్ని కోరింది. కానీ ఆశించినంత సాయం అందకపోవటంతో కరువు ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై ప్రభావం పడనుంది. కరువు మండలాల్లో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఇన్‌పుట్ సబ్సిడీ అందివ్వాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకం పని దినాలను 200 రోజులకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. వీటితోపాటు మంచినీటి వసతులు, పశువులకు దాణా లాంటి తక్షణ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది.

కరువు నివారణ శాశ్వత చర్యల్లో భాగంగా నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం, భూగర్భజలాల పెంపు, అడవుల వృద్ధిపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరముందని సీఎం కేసీఆర్ కేంద్ర బృందానికి వివరించారు. కేంద్రానికి ఇచ్చిన నివేదికలోనూ వ్యవసాయ శాఖకు రూ.863 కోట్లు, గ్రామీణ మంచినీటి సరఫరాకు రూ.400 కోట్లు, పట్టణ మంచినీటి సరఫరాకు రూ.80 కోట్లు, మెట్రో వాటర్ వర్క్స్‌కు రూ.90 కోట్లు, పశు సంవర్థక శాఖకు రూ.42 కోట్లు, ఉపాధి హామీ పథకానికి రూ.369 కోట్లు, బతుకుదెరువు ఫించన్లకు రూ.700 కోట్లు మంజూరు చేయాలని ప్రతిపాదించారు. కానీ కేంద్రం రూ.791 కోట్లే విడుదల చేయటంతో ఏ మూలకూ సరిపోయేలా లేవని ప్రభుత్వ  వర్గాలు నిట్టూరుస్తున్నాయి. దీంతో కరువు ప్రాంతాల్లో చేపట్టే కార్యక్రమాల భారం కూడా రాష్ట్ర ఖజానాపైనే పడటం ఖాయమైందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
 

Advertisement
Advertisement