‘కశ్మీర్కు అఖిలపక్ష బృందం’
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్లో క్షేత్రస్ధాయి పరిస్ధితులను సమీక్షించేందుకు రాష్ట్రంలోకి అఖిల పక్ష ప్రతినిధి బృందాన్ని ఆహ్వానించాలని సీనియర్ కాంగ్రెస్ నేత శశి థరూర్ జమ్మూ కశ్మీర్ గవర్నర్ సత్య పాల్ మాలిక్ను కోరారు. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో కశ్మీర్లో హింస చెలరేగుతోందని రాహుల్ చేసిన వ్యాఖ్యలకు స్పందించిన గవర్నర్ సత్యపాల్ మాలిక్ కశ్మీర్ లోయలో పర్యటించేందుకు రాహుల్కి తాను విమానం పంపుతానని ఆయన ఇక్కడ పర్యటించి పరిస్థితులు తెలుసుకోవచ్చని, బాధ్యత కలిగిన నేత ఇలా మాట్లాడటం తగదని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
మరోవైపు జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి ఎలాంటి మతపరమైన కోణం లేదని గవర్నర్ స్పష్టం చేశారు. గవర్నర్ వ్యాఖ్యల నేపథ్యంలో శశి థరూర్ కశ్మీర్కు అఖిలపక్ష బృందాన్ని ఆహ్వానించాలని కోరడం గమనార్హం. రాహుల్ ఒక్కరే ఎందుకు గవర్నర్జీ..కాంగ్రెస్ తరపున జమ్మూ కశ్మీర్ పరిస్థితిని తమ కళ్లకు కట్టేలా అఖిల పక్ష బృందాన్ని ఆహ్వానించాలని తాను లోక్సభలో ప్రభుత్వాన్ని కోరానని శశి థరూర్ ట్వీట్ చేశారు.