ప్చ్‌.. మళ్లీ పప్పులో కాలేసిన రాహుల్‌ | Rahul Gandhi Trolls over Retired Jawan Crying Pic | Sakshi
Sakshi News home page

మాజీ జవాన్‌ ఫోటో.. రాహుల్‌కి ట్విస్ట్‌

Nov 8 2017 4:49 PM | Updated on Sep 27 2018 9:08 PM

Rahul Gandhi Trolls over Retired Jawan Crying Pic - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని మరోసారి సోషల్ మీడియాలో ట్రోలింగ్‌ చేసేందుకు రంగం సిద్ధమైంది. అందుకు కారణం రాహుల్‌ పోస్ట్ చేసిన ఓ ఫోటోనే. 

డీమానిటైజేషన్‌కు ఏడాది పూర్తయిన సందర్భంగా నోట్ల కష్టాలను ప్రతిబింబించే ఐకానిక్‌ ఫోటో అంటూ ఓ మాజీ జవాన్‌ ఫోటోను రాహుల్‌ పోస్టు చేశారు. ‘‘ప్రజల కన్నీళ్లు ప్రభుత్వానికి మంచిది కాదు. అవి సముద్రాలుగా ఉప్పొంగితే మీరు కొట్టుకుపోతారు అని అర్థం వచ్చేలా హిందీలో ఓట్వీట్ చేశారు. అయితే అందులో ఉన్న పెద్దాయన నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రశంసిస్తూ ఇంటర్వ్యూ ఇవ్వటంతో రాహుల్‌కి ఝలక్ ఇచ్చినట్లయ్యింది.

రాహుల్ ట్వీట్ అనంతరం గుర్‌గావ్‌లోని నంద్‌ లాల్‌ ఇంటిని సందర్శించిన జాతీయ మీడియా సంస్థ ఏఎన్‌ఐ ఆయనను ఆరాతీసింది. ‘‘అది దేశానికి మేలు చేసే నిర్ణయం. ఈ ఉగ్రవాదులు(నిర్ణయాన్ని వ్యతిరేకించేవారు) అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు’’ అని ఆయన పేర్కొన్నారు. అంతకు ముందు మరో జాతీయ మీడియాతో కూడా ఆయన ప్రభుత్వం ఏం చేసినా అది దేశప్రజల సంక్షేమం కోసమే అంటూ చెప్పినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మోదీ పాలనపై నందన్ లాల్ పూర్తి సంతోషంతో ఉన్నారన్న విషయం ఆయన మాటలను బట్టి అర్థమౌతోందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ మీడియాకు తెలిపారు.  ప్రస్తుతం నందన్‌ లాల్‌ వీడియో వైరల్ కాగా, నిర్ధారణ చేసుకోకుండా రాహుల్ చేసిన పనికి అల్రెడీ ఆయన ట్విట్టర్ ఖాతాలో కామెంట్లు మొదలయ్యాయి.

నంద్‌ లాల్‌ అనే 80 ఏళ్ల మాజీ జవాన్‌ స్టేట్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యూలో నిల్చుని రోదించటం అందులో ఉంది. మూడు రోజులు తిరిగినా పెన్షన్ లభించకపోవటంతో ఆయనలా ఏడ్చాడంటూ ఓ వార్తా సంస్థ ఫోటో గ్రాఫర్‌ ఫోటో తీసి కథనం ప్రచురించింది. దీంతో అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Advertisement
 
Advertisement
Advertisement