ఆ రాత్రి నిద్ర పట్టలేదు : మోదీ

Narendra Modi Speech In Pariksha Pe Charcha - Sakshi

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. చంద్రయాన్‌-2 విక్రమ్‌ ల్యాండర్‌ సాంకేతిక కారణాలతో విఫలమైన రోజు తనకు నిద్ర పట్టలేదని మోదీ చెప్పారు. ఆ రాత్రి నిద్రపోలేదని పేర్కొన్నారు. విద్యార్థులకు పరీక్షల కాలం సమీపిస్తుండటంతో మోదీ సోమవారం ‘పరీక్ష పే చర్చా’ కార్యక్రమం నిర్వహించారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో 2 వేల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ విద్యార్థులతో మాట్లాడుతూ.. చంద్రయాన్‌-2 లాంచ్‌ మిషన్‌ను వీక్షించేందుకు వెళ్లవద్దని తనకు పలువురు సూచించారు. అది విజయవంతం అవుతుందనే నమ్మకం లేదని.. విఫలమైతే పరిస్థితి ఎలా ఉంటుందోనని వారు అన్నారు. కానీ నేను మాత్రం ఇస్రోకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాను.

అయితే విక్రమ్‌ ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయాయని ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పిన తరువాత.. నేను అక్కడి నుంచి హోటల్‌కు వెళ్లిపోయాను. కానీ ఈ పరిణామంతో అసంతృప్తి చెందలేదు. ఆ తర్వాత పీఎంవో అధికారులును పిలిచి ఇస్రో శాస్త్రవేత్తలతో రేపు ఉదయం సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా సూచించాను. వెంటనే తన షెడ్యూల్‌ను మార్చవల్సిందిగా పీఎంవో బృందాన్ని ఆదేశించాను. మరుసటి రోజు ఉదయమే శాస్త్రవేత్తలతో భేటీ అయ్యాను. ఈ సందర్భంగా చంద్రయాన్‌-2 కోసం కష్టపడిన శాస్త్రవేత్తల శ్రమను అభినందించాను. నా భావాలను వారితో పంచుకున్నాను. ఈ ఘటన ఓటమి నుంచి గెలుపు పాఠాలు నేర్పిందన్నాను. రాబోయే రోజుల్లో భారీ విజయాలు సాధించవచ్చని చెప్పాను. మనం అనుకున్న విధంగా చంద్రుని ఉపరితలాన్ని చేరుకోలేపోయాం.. కానీ దీనిని ఓ కవి మాత్రం చంద్రున్ని తాకలానే తాపత్రాయంతో విక్రమ్‌ ల్యాండర్‌ వేగంగా దూసకెళ్లిందని అభివర్ణించారు’ అని తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top