
కేంద్రం మాటిస్తేనే.. ముందుకు!
రాష్ట్రంలో సానుకూల వాతావరణం ఏర్పడేలా విశ్వాస కల్పన చర్యలు చేపట్టేందుకు కేంద్రంలోని మోదీ సర్కారు సంసిద్ధత వ్యక్తం చేస్తే తప్ప..
జమ్మూకశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుపై పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ
జమ్మూ: రాష్ట్రంలో సానుకూల వాతావరణం ఏర్పడేలా విశ్వాస కల్పన చర్యలు చేపట్టేందుకు కేంద్రంలోని మోదీ సర్కారు సంసిద్ధత వ్యక్తం చేస్తే తప్ప.. బీజేపీతో కలిసి జమ్మూకశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాబోమని పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ తేల్చిచెప్పారు. ‘ఆ దిశగా కేంద్రం నుంచి హామీ వస్తే మంచిది.. లేదంటే పరిస్థితి ఇలాగే కొనసాగుతుంది’ అని శుక్రవారం పార్టీ నేతలతో భేటీలో అన్నారు. రాష్ట్రసమస్యల పరిష్కారానికి కేంద్రం సహకారం అవసరమన్నారు.
కేంద్రం నుంచి ఆర్థిక పరమైన సహకారం కాకుండా, రాజకీయ కోణంలో సహకారం కోరుతున్నట్లు ఆమె సంకేతాలిచ్చారు. ‘నిధుల అంశం ముఖ్యం కాదు.. ప్రజల మధ్య సహానుభూతి నెలకొనే సానుకూల వాతావరణం ఏర్పడాలి. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం లభించాలి’ అని కుండబద్దలు కొట్టారు. తాను కేంద్రాన్ని బ్లాక్మెయిల్ చేయడం లేదన్నారు. ‘రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న నా తండ్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ఆలోచన మనందరికీ ఆమోదయోగ్యమే. ఆయన మాటే నా మాట. అయితే, నాన్న మరణానంతరం నెలకొన్న శూన్యాన్ని భర్తీ చేయడం నాకు కష్టసాధ్యంగా మారింది.
జమ్మూకశ్మీర్ అన్ని రాష్ట్రాల వంటిది కాదు. ఇక్కడ చాలా సమస్యలున్నాయి’ అని పార్టీ నేతలకు వివరించారు. అధికారానికి దూరంగా ఉండేందుకూ సిద్ధమేనని సంకేతాలిస్తూ.. అధికారంలో లేకుండా కూడా తన తండ్రి రాష్ట్రాభివృద్ధికి కృషి చేశారన్నారు. జమ్మూకశ్మీర్లో శాంతి నెలకొనాలంటే భారత్, పాకిస్తాన్లు కలిసి సాగాలన్న తన తండ్రి భావనను గుర్తుచేస్తూ.. ఆయన సైద్ధాంతిక స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాల్సి ఉందన్నారు.
పాక్లో సయీద్ భారత వ్యతిరేక ర్యాలీ
లాహోర్: ముంబై దాడుల సూత్రధారి, జమాత్ ఉద్ దవా(జేయూడీ) చీఫ్ హఫీజ్ సయీద్ శుక్రవారం కశ్మీర్ సంఘీభావ దినం సందర్భంగా పాక్ రాజధాని ఇస్లామాబాద్లో భారత వ్యతిరేక ర్యాలీ నిర్వహించాడు. పలు పాక్ నగరాల్లోకూడా ఇలాంటి ర్యాలీలు జరిపారు. ‘పాక్లోని ప్రతి బిడ్డా కశ్మీరీల స్వాతంత్య్రం కోసం ప్రాణాల్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. కశ్మీరీలకు మద్దతివ్వాలని మన రాజ్యాంగం కూడా చెబుతోంది’ అని సయీద్ అన్నాడు.