సరిహద్దు వివాదం: ముగిసిన చర్చలు | Sakshi
Sakshi News home page

సుదీర్ఘంగా సాగిన ఇండో-చైనా సైనికాధికారుల భేటీ

Published Thu, Jun 18 2020 7:20 PM

Major General Level Talks Between India And China Over - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తూర్పు లడఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి భారత్‌, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో సరిహద్దు ఉద్రిక్తతలను నివారించేందుకు గురువారం ఆరుగంటల పాటు సాగిన ఇరు దేశాల మేజర్‌ జనరల్‌ స్ధాయి చర్చలు ముగిశాయి. గాల్వన్‌ లోయలో సాధారణ స్ధితి నెలకొనేలా చూడటంతో పాటు సరిహద్దుల నుంచి సేనల ఉపసంహరణపై వరుసగా మూడోరోజూ ఇరు దేశాల సీనియర్‌ సైనికాధికారులు సుదీర్ఘంగా చర్చించారు. గాల్వన్‌ లోయలో సోమవారం రాత్రి ఇరు దేశాల సైనికుల మధ్య చెలరేగిన ఘర్షణలో కల్నల్‌ బీ. సంతోష్‌బాబు సహా 20 మంది భారత జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే.

కాగా గత రెండు రోజులుగా గాల్వన్‌ లోయలో భారత్‌-చైనా సైనికాధికారుల మధ్య జరిగిన చర్చల్లో ప్రతిష్టంభన నెలకొనగా తాజా చర్చల సారాంశం ఇంకా తెలియరాలేదు. మరోవైపు డ్రాగన్‌ సైన్యంతో జరిగిన ఘర్షణల్లో 20 మంది సైనికులు మరణించడం, మరో 18 మంది జవాన్లకు గాయాలవడం మినహా ఏ ఒక్కరి ఆచూకీ గల్లంతు కాలేదని సైనిక వర్గాలు తెలిపాయి. ఇక చైనా దూకుడు తగ్గించకుంటే దౌత్యం యుద్ధం తప్పదని, ఆ దేశ వస్తువుల బహిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

Advertisement
Advertisement