క‌రోనా వ‌ల్ల ఓ మంచి జ‌రిగింది: న‌టుడు | Sakshi
Sakshi News home page

మహాభార‌తం తిరిగి వ‌చ్చేసింది

Published Sun, Mar 29 2020 6:27 PM

Mahabharat Returns to TV And Duryadhana Give Advice For All - Sakshi

అల‌నాటి పౌరాణిక సీరియ‌ల్స్‌ రామాయ‌ణం, మ‌హాభార‌తాలు వీక్ష‌కుల‌ను టీవీల‌కు అతుక్కుపోయేలా చేశాయ‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు. సుమారు మూడు ద‌శాబ్దాల త‌రువాత తిరిగి ఇవి తిరిగి ప్ర‌సారం కానున్నాయి. క‌రోనా భ‌యంతో ఇంటిప‌ట్టునే ఉన్న జ‌నాల‌కు ఈ సీరియ‌ల్స్ త‌ప్ప‌కుండా ఊర‌ట క‌లిగిస్తాయి. ఈ నేప‌థ్యంలో మ‌హాభార‌తంలో దుర్యోధ‌నుడిగా క‌నిపించిన నటుడు పునీత్ ఇస్సార్ ప్రేక్ష‌కుల‌కు కొన్ని సూచ‌న‌లు అందించాడు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నిరోధించేందుకుగానూ ప్ర‌తి ఒక్క‌రూ సామాజిక ఎడం పాటించాల‌ని కోరాడు. త‌మ‌ గృహంలో బ‌య‌టి వారు లోప‌లికి రావ‌డం కానీ, లోప‌లి వారు బ‌య‌ట‌కు వెళ్ల‌డం కానీ పూర్తిగా నిషేధ‌మ‌ని తెలిపాడు. మాలాగే అందరూ ఇంటి గ‌డ‌ప దాట‌వ‌ద్ద‌ని సూచించాడు.

అంతేకాకుండా.. తాము ఇంటి ప‌నుల‌ను కూడా విభ‌జించుకున్న‌ట్లు తెలిపాడు. క‌రోనా పుణ్య‌మాని కుటుంబం అంతా క‌లిసి భోజ‌నం చేస్తున్నామ‌ని ఓ పాజిటివ్ అంశాన్ని సైతం చెప్పుకొచ్చాడు. పునీత్ మ‌హాభార‌తం సీరియ‌ల్‌లో న‌టించ‌డ‌మే కాక దానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన విష‌యం తెలిసిందే. ఈ సీరియ‌ల్ డీడీ భార‌త్‌లో మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు, సాయంత్రం ఏడింటికి గంట నిడివితో రెండు ఎపిసోడ్లు ప్ర‌సారమ‌వుతున్నాయి. దీనితోపాటు డీడీ నేష‌న‌ల్‌లో రామాయ‌ణం ఉద‌యం తొమ్మిది గంట‌లకు ఒక ఎపిసోడ్‌, రాత్రి తొమ్మిదింటికి మ‌రో ఎపిసోడ్‌ ప్ర‌సారం కానుంది. ఈ రెండూ కూడా మార్చి 28నుంచి ప్రారంభ‌మయ్యాయి. (రామాయ‌ణ్ చూస్తున్నా.. మ‌రి మీరు?)

Advertisement
Advertisement