మోదీ సొంత రాష్ట్రంలో వెలుగు చూసిన దారుణం

In Gujarat Pregnant Woman Made To Deliver Standing Upright - Sakshi

గాంధీ నగర్‌ : ‘బేటీ బచావో.. బేటీ పడావో’ అంటూ ప్రగల్భాలు పలికే మోదీ సొంత రాష్ట్రంలో ఓ గర్భిణి మహిళ పట్ల వైద్య సిబ్బంది అమానుషంగా వ్యవహరించారు. ఈ సంఘటన గురించి చెప్పడానికి దారుణం, కిరాతకం వంటి మాటలేవి సరిపోవు. నెలలు నిండిన ఓ మహిళకు నిల్చోబెట్టి పురుడు పోసిన దారుణం గుజరాత్‌ బనస్కాంథ జిల్లాలో చోటు చేసుకుంది. గత శుక్రవారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. రామి బెన్‌ గౌతంభాయ్‌ ఠాకూర్‌ అనే మహిళ డెలివరి కోసం తన అత్తతో కలిసి జలోటా ఆరోగ్య కేంద్రానికి వచ్చింది.

ప్రసూతి గదిలోకి తీసుకెళ్లి పురుడు పోయాల్సిన నర్సు కాస్త.. రామి బెన్‌ను ఎదురుగా ఉన్న ఇనుప రాడ్డు పట్టుకొని నిల్చోమని చెప్పి అలానే పురుడు పోసింది. ప్రసవం అయ్యి బిడ్డ బయటకు వచ్చాక.. రామి బెన్‌ చీరతోనే నేల మీద పడ్డ రక్తాన్ని తుడిపించింది. విషయం తెలుసుకున్న రామి బెన్‌ బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేయడంతో ఈ దారుణం వెలుగు చూసింది. అయితే ఇలా నిల్చోబెట్టి ప్రసవం చేయడం ఈ ఆరోగ్య కేంద్రంలో కొత్తేం కాదని.. గతంలోను ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయని కొందరు మహిళలు తెలిపారు. అయితే ఈ ఆరోపణలను సదరు ఆస్పత్రి యాజమాన్యం ఖండించింది. తమ ఆస్పత్రిలో ఇలాంటి సంఘటనలు ఎన్నడు జరగలేదని సీనియర్‌ వైద్యుడొకరు తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top