త్యాగిపై మనీల్యాండరింగ్ కేసు | Enforcement Directorate Slaps Laundering Case Against Ex- Indian Air Force Chief | Sakshi
Sakshi News home page

త్యాగిపై మనీల్యాండరింగ్ కేసు

Jul 5 2014 4:04 AM | Updated on Sep 15 2018 3:51 PM

త్యాగిపై మనీల్యాండరింగ్ కేసు - Sakshi

త్యాగిపై మనీల్యాండరింగ్ కేసు

అగస్టా వెస్ట్‌ల్యాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణం దర్యాప్తులో శుక్రవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.

* అగస్టా కుంభకోణం దర్యాప్తులో పురోగతి
* గోవా గవర్నర్ వాంఛూ వాంగ్మూలం నమోదు చేసిన సీబీఐ
* అనంతరం పదవికి వాంఛూ రాజీనామా

 
 న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్‌ల్యాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణం దర్యాప్తులో శుక్రవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వైమానిక దళ మాజీ అధినేత ఎస్పీ త్యాగితో పాటు మరికొందరిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) నగదు అక్రమ రవాణా కేసు నమోదు చేసింది. మరోవైపు ఈ కేసులో సాక్షిగా గోవా గవర్నర్, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) మాజీ చీఫ్ బి.వి.వాంఛూ వాంగ్మూలాన్ని సీబీఐ శుక్రవారం పణజీలో నమోదు చేసింది.
 
 రూ.3,600 కోట్ల విలువైన 12 అత్యాధునిక హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందానికి సంబంధించి ముడుపుల స్వీకారం ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి విదితమే. ఈ ఒప్పందం సాకారమయ్యేందుకు అగస్టా కంపెనీ ముడుపులు చెల్లించినట్టుగా ఇటలీ అధికారులు ఆరోపించడంతో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. అగ స్టా బిడ్ దాఖలు చేసేందుకు వీలుగా హెలికాప్టర్ ఎగరాల్సిన ఎత్తుకు సంబంధించిన పరిమితిని తగ్గించారనేది సీబీఐ.. ఐఏఎఫ్ అప్పటి చీఫ్ త్యాగిపై చేసిన ఆరోపణ. తొలుత విదేశీ మారకం చట్టాల కింద కేసు నమోదు చేసిన ఈడీ.. ముడుపుల కింద ముట్టినట్టుగా భావిస్తున్న రూ.360 కోట్ల నగదును కనుగొనే దిశలో క్రిమినల్ కేసు నమోదు చేయూలని నిర్ణరుుంచింది. ఏడాది క్రితం సీబీఐ చేసిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న ఈడీ తాజాగా త్యాగి, ఆయన కుటుంబసభ్యులు, ఐరోపా జాతీయులు కార్లో గెరోసా, క్రిస్టియన్ మైఖేల్, గిడో హష్కేలపై నగదు అక్రమ రవాణా నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద కేసు నమోదు చేసింది.
 
 వీరితో పాటు ఇటలీకి చెందిన ఫిన్‌మెక్కానికా, బ్రిటన్‌కు చెందిన అగస్టా వెస్ట్‌ల్యాండ్, చండీగఢ్‌కు చెందిన ఐడీఎస్ ఇన్ఫోటెక్, ఏరోమ్యాట్రిక్స్ కంపెనీలపై కూడా కేసు నమోదు చేసింది. మొత్తం 13 మంది వ్యక్తులు, సంస్థల పేర్లను కేసులో పేర్కొన్న ఈడీ త్వరలోనే వీరి వాంగ్మూలాల నమోదు ప్రక్రియ ప్రారంభించనుంది. ఈ కేసులో సాక్షులుగా.. ఇటీవల పశ్చిమబెంగాల్ గవర్నర్, జాతీయ భద్రతా మాజీ సలహాదారు ఎం.కె.నారాయణన్ వాంగ్మూలం నమోదు చేసిన సీబీఐ బృందం తాజాగా శుక్రవారం గోవా గవర్నర్ బి.వి.వాంఛూ వాంగ్మూలం నమోదు చేసింది.
 
  హెలికాప్టర్‌కు సంబంధించిన సాంకేతిక విశిష్టతల్లో మార్పులకు అనుమతించిన 2005 నాటి సమావేశంలో నారాయణన్, వాంఛూలిద్దరూ పాల్గొన్నారు. దర్యాప్తు సంస్థ త్వరగా వాస్తవాలను వెలికితీయగలదని వాంఛూ ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం వాంఛూ తన పదవికి రాజీనామా చేశారు. పదవి నుంచి తప్పుకోవాల్సిందిగా కేంద్ర హోం కార్యదర్శి అనిల్ గోస్వామి ఫోన్ చేసి కోరడంతో ఆయన రాజీనామా చేసినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. సీబీఐ ప్రశ్నించిన తర్వాతే నారాయణన్ కూడా తన పదవికి రాజీనామా సమర్పించడం తెలిసిందే. గత డిసెంబర్‌లో అప్పటి యూపీఏ ప్రభుత్వం 2010లో అగస్టాతో జరిగిన ఒప్పందాన్ని రద్దు చేసింది. ఇలావుండగా ముడుపులు చెల్లించిన ఆరోపణల నేపథ్యంలో ఫిన్‌మెక్కానికా మాజీ సీఈవో గిసెప్పీ ఓర్సీకి ఆరేళ్లు, అగస్టా మాజీ సీఈఓ బ్రూనో స్పాగ్నోలినీకి ఐదేళ్లు జైలుశిక్ష విధించాలని ఇటలీ ప్రాసిక్యూటర్లు కోరినట్టు అక్కడి మీడియూ నివేదికలను బట్టి తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement