100 కి.మీ వేగంతో వరుసగా ముగ్గురిని ఢీకొట్టి.. | Sakshi
Sakshi News home page

100 కి.మీ వేగంతో వరుసగా ముగ్గురిని ఢీకొట్టి..

Published Tue, Jun 14 2016 9:27 AM

100 కి.మీ వేగంతో వరుసగా ముగ్గురిని ఢీకొట్టి.. - Sakshi

న్యూఢిల్లీ: ఓ పార్టీలో పీకలదాకా మద్యం తాగి ఇష్టం వచ్చినట్లు కారునడుపుతూ ఇద్దరు వ్యక్తులు ప్రాణాలుపోయేందుకు కారణమయ్యాడు ఓ యువకుడు. వరుసగా రెండుసార్లు తన కారుతో ఢీకొట్టి ఇద్దరు ప్రాణాలు తీయడమే కాకుండా మరొకరిని తీవ్రంగా గాయపరిచాడు. ఈ ప్రమాదం చోటుచేసుకున్నప్పుడు అతడు 100 కిలోమీటర్ల వేగంతో ఉన్నాడట. 1.5కిలోమీటర్ల దూరంలోనే వరుసగా ఈ ముగ్గురుని అతడు ఢీకొట్టి అనంతరం పట్టుబడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం ఉదయం ఢిల్లీలోని జనక్ పురికి చెందిన రిషబ్ అనే 21 ఏళ్ల యువకుడు తన తండ్రి హోండా సిటీ కారు తీసుకొని పార్టీకి వెళ్లాడు.

నగరంలోని ఓ ప్రముఖ వర్సిటీలో బిజినెస్ మేనేజ్ మెంట్ చదువుతున్న అతడు పార్టీలో ఫుల్లుగా తాగి వస్తూ తొలుత మార్నింగ్ వాక్ కు వెళ్లొస్తున్న కామేశ్వర్ ప్రసాద్ అనే వ్యక్తిని ఢీకొట్టాడు. అంతటితో ఆగకుండా మరింత వేగంగా వెళుతూ అశ్వని ఆనంద్ అనే 67 ఏళ్ల పెద్ద మనిషిని ఢీకొట్టాడు. తిరిగి అదే వేగంతో పేవ్ మెంట్ మీదుగా వెళుతూ సంతోష్ అనే వ్యక్తిని గుద్దేయగా అతడు తీవ్ర గాయాలపాలయ్యాడు. పోలీసుల పెట్రోలింగ్ వాహనం అతడిని చేజ్ చేసి పట్టుకుంది. ఆ కారును సీజ్ చేసి అతడిపై కేసు నమోదు చేశారు. తీవ్ర గాయాలపాలయిన వ్యక్తి పరిస్థితి కూడా విషమంగానే ఉంది. ఆ కారులో మద్యం సీసా కూడా దొరికినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement